లండన్ లో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ (65) దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రాయీస్ ఉద్దీన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యచేసి అతడి దగ్గరున్న నగదు, నగలను ఎత్తుకెళ్లారు.
2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉగాండాకు చెందిన వ్యక్తి ఖాజాతో మరో అఫ్గాని వ్యక్తిని పొడిచి చంపాడు. డబ్బుల కోసం గొడవ పడి కత్తితో పొడిచి పరారైనట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రయీస్ ఉద్దీన్ ను అసలు ఎందుకు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో కూతురి పెళ్లి ఉందనగా.. రయీస్ హత్యకు గురవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రయీస్ ఉద్దీన్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ను కోరారు.