- ఒకరిని కాపాడబోయి కన్నుమూసిన మరో ఇద్దరు
- దవాఖానలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
- హైదరాబాద్లో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో మ్యాన్హోల్లో దిగి పనులు చేస్తున్న ముగ్గురు కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. రక్షణ చర్యల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్కంపెనీ 1200 ఎమ్ఎమ్ పైప్ లైన్లను వేసే పనులు చేయిస్తోంది. ఇందులో భాగంగా పురానాపూర్ పాత బ్రిడ్జి సమీపంలో హనుమాన్ టెంపుల్ వద్ద మ్యాన్ హోల్స్మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి.
మహబూబ్నగర్ కు చెందిన రాములు (50), నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన హనుమంతు (42), వనపర్తికి చెందిన శీను (40) కార్మికులు గా ఈ పనులు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హనుమాన్టెంపుల్వద్ద ఎనిమిది ఫీట్ల లోతు ఉన్న మ్యాన్హోల్లోకి రాములు దిగి క్లీన్చేస్తుండగా, పైన హనుమంతు, శ్రీను ఉన్నారు. విషవాయుల ప్రభావంతో రాములు స్పృహ తప్పాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో హనుమంతు, శ్రీను లోపలకు దిగి రాములును పైన పడేశారు.
అయితే, హనుమంతు, శ్రీను కూడా మ్యాన్హోల్లో విషవాయువులు పీల్చడంతో అందులోనే చనిపోయారు. రాములును దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. విష వాయువుల ప్రభావం ఉంటుందని తెలిసినా సేఫ్టీ మెజర్స్మెంట్స్గురించి పట్టించుకోకపోవడం వల్లే ముగ్గురు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్కంపెనీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.