
మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అధియాన్ అనే 5ఏళ్ల బాలుడ్ని ఓ యువకుడు కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన మేడ్చల్, హైదరాబాద్లో కలకలం రేపుతోంది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధియాన్ (5) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు సయ్యద్ యూసఫ్,గౌసియాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండ్రోజుల పాటు అధియాన్ కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికి.. చివరికి 15న బాలుడు కనిపించట్లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి ఇంట్లో కిరాయికి ఉండే యువకుడే బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాలుడి కుటుంబం కిరాయికి ఉంటున్న ఇంటి పై అంతస్థులోనే ఉంటున్న బీహార్ కు చెందిన సుధాంశ అనే వ్యక్తి హత్య చేసినట్లు బషీరాబాద్ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. బాలున్ని షేర్ చాట్ వీడియో తీసేందుకు బాలున్ని తన ఇంట్లోకి తీసుకుపోయిన నిందితుడు ఇంట్లోనే బాలున్ని హత్య చేసి, సంచిలో తీసుకొచ్చి ఓ ఆర్ ఆర్ వద్ద పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడు బాలుని ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి 15 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ డాటా ఆధారంగానే నిందితున్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.