గచ్చిబౌలి, వెలుగు: పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను చోరీ చేస్తున్న ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖకు చెందిన సంతోష్దాస్పదోతరగతి మధ్యలో ఆపేసి, జులాయిగా తిరిగేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, డబ్బుల కోసం ఖరీదైన బైక్లను దొంగలించి, తక్కువ ధరకు తెలిసిన వ్యక్తులకు అమ్మేవాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బెజ్జంకి మణికంఠ, రాజమండ్రి లాలచెరువు ప్రాంతానికి చెందిన లోకేశ్వర్మ నగరానికి వలస వచ్చి జెప్టో డెలివరీ బాయ్గా చేస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి మియాపూర్న్యూకాలనీలో ఉంటున్నారు. సంతోష్దాస్ కు గతంలో బైక్లు చోరీ చేసిన అనుభవనం ఉండటం.. అదే పని చేయాలనుకున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు, ఇండ్ల ఎదుట నిలిపిన ఖరీదైన ద్విచక్రవాహనాలను దొంగలించడం మొదలుపెట్టారు. వాటిని సంతోష్దాస్ తక్కువ ధరకు సొంతూరిలో తనకు తెలిసిన హేమంత్, సాయిరాంలకు విక్రయిస్తున్నాడు. మంగళవారం కొత్తగూడ చౌరస్తా వద్ద గచ్చిబౌలి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఆ సమయంలో బైక్పై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బైక్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీ తదితర 17 వాహనాలను స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు.
