
- ఐటీ కంపెనీలు లాగౌట్
- టైమింగ్స్ మార్చుకోవాలి
- జీహెచ్ఎంసీ కమిషనర్ సూచన
- వ్యక్తిగత వాహనాల వినియోగం
- తగ్గించాలన్న హైడ్రా చీఫ్
- ఆగస్టు 13,14 స్కూళ్లకు హాఫ్ డే
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అవరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు సూచించారు. ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉం దని, హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పని చేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు.
కృష్ణా నగర్లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని, మైత్రీవనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండడంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామన్నారు. అత్యవరమైతే హెల్ప్ లైన్ నంబర్ 040–21111111 కు కాల్ చేయాలన్నారు.
వర్క్ఫ్రం హోం ఇవ్వండి : హైడ్రా
భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. 15 నుంచి 20 సెంటిమీటర్ల వర్షం కురిసే చాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవరమైతే హైడ్రా హెల్ప్లైన్ నంబర్ల 040 29560521, 9000113667, 9154170992కు కాల్ చేయాలన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు బల్దియా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ 13, 14 తేదీల్లో హాఫ్ డే స్కూల్స్ నడిపించాలని ఆదేశాలు జారీ చేశారు.