
సిటీ సెయిలర్లకు ఆరు మెడల్స్
హైదరాబాద్, వెలుగు: యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైఏఐ) ఆధ్వర్యంలో జరిగిన మైసూర్ మల్టీ క్లాస్ యూత్ చాంపియన్షిప్, కైట్బోర్డ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో మెరిశారు. మైసూరులోని కృష్ణరాజసాగర రిజర్వాయర్లో ముగిసిన ఈ పోటీల్లో జూనియర్ ఫ్లీట్ ఈవెంట్లో వైష్ణవి వీరవంశం గోల్డ్ సాధించగా, ఝాన్సీ ప్రియా లావేటి బ్రాంజ్ నెగ్గింది. లైట్ వెయిట్ బిగినర్లు పోటీపడే గ్రీన్ ఫ్లీట్లో మూడు పతకాలు వచ్చాయి. గర్ల్స్లో లాహిరి కొమరవెల్లి టాప్ ప్లేస్తో గోల్డ్ నెగ్గగా, బాయ్స్లో సాహిత్ బండారం, అమితవ వీరారెడ్డి వరుసగా సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. సబ్ జూనియర్స్ విభాగంలో తనూజ కామేశ్వర్ రజతం కైవసం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మరో సెయిలర్ ఎంఎస్ డేనియల్ ఒక రేసులో విజయం సాధించి టాప్5లో చోటు సాధించాడు.
విషాదంగా ప్రేమ జంట పెండ్లి
అమ్మాయిని తీసుకెళ్లిన పేరెంట్స్
మనస్తాపంతో మూడ్రోజుల కిందట యువతి సూసైడ్
ఆమె మరణాన్ని తట్టుకోలేక మౌలాలిలో రైలు కిందపడి చనిపోయిన యువకుడు
సికింద్రాబాద్, వెలుగు: రెండు నెలల కిందట ప్రేమ పెండ్లి చేసుకున్న జంట జీవితం విషాదంగా ముగిసింది. యువతి పేరెంట్స్ ఆమెను తీసుకెళ్లి కర్ణాటకకు పంపించడంతో మూడ్రోజుల కిందట అమ్మాయి అక్కడే సూసైడ్ చేసుకోగా.. బుధవారం మౌలాలిలో రైలు కింద పడి యువకుడు చనిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రానికి చెందిన నిఖిత(19) కుటుంబం ఉపాధి కోసం సిటీకి వచ్చి శివరాంపల్లిలో ఉంటోంది. ఆమె తల్లి అదే ఏరియాలో కూరగాయలు అమ్మేది. మల్కాజిగిరి పరిధి వినాయక్నగర్లో ఉండే వేముల శ్రీకాంత్(20) ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు. శ్రీకాంత్కు రెండేండ్ల కిందట నిఖితతో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీయడంతో ఇద్దరు పెండ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించిన శ్రీకాంత్, నిఖిత ఈ ఏడాది జూన్ 4న ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకుని వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు. నిఖిత పేరెంట్స్ అమ్మాయి కనిపించడం లేదంటూ రాజేంద్రనగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. 24 రోజుల తర్వాత వీరి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు పీఎస్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. శ్రీకాంత్కు 20 సంవత్సరాలు ఉండటంతో చట్ట ప్రకారం అది పెండ్లి ఏజ్ కాదని.. 21 ఏండ్లు వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్లొచ్చని పోలీసులు అతడికి చెప్పి నిఖితను పేరెంట్స్ కు అప్పగించారు. 4 నెలల్లో శ్రీకాంత్కు 21 ఏండ్లు నిండుతుండటంతో అప్పుడు నిఖితను పంపిస్తామని చెప్పి ఆమె పేరెంట్స్ తీసుకెళ్లారు. నిఖిత ఇక్కడే ఉంటే మళ్లీ శ్రీకాంత్ దగ్గరికి వెళ్తుందేమోనని.. వారం రోజుల కిందట కర్ణాటకలోని నాయనమ్మ దగ్గరికి ఆమెను పంపించారు. తమను వీడదీశారనే మనస్తాపంతో నిఖిత ఈ నెల 15న నాయనమ్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఆమె మరణాన్ని తట్టుకోలేక బుధవారం ఉదయం 10.45 గంటలకు మౌలాలి గేట్ క్రాసింగ్, అమ్ముగూడ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎజాజ్ ఫారుఖీకి ఈడీ క్లీన్ చిట్
హైదరాబాద్, వెలుగు : రైల్వే కాంట్రాక్టుల్లో రూ.100 కోట్ల స్కామ్ చేశారని తమ క్లయింట్ ఎజాజ్ ఫారుఖీపై వచ్చిన వార్తలను ఆయన తరపు న్యాయవాది దివ్యం అగర్వాల్ ఖండించారు. మనీ లాండరింగ్, స్కామ్ పేరుతో జరిగిన ప్రచారంలో నిజం లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. ఈడీ సోదాలను ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యక్తులు తమ క్లయింట్పై నిరాధారమైన ఆరోపణలు, ప్రచారం చేశారని అన్నారు. ఈడీ స్వయంగా మీడియాకు చెప్పినట్టుగా వచ్చిన వార్తలపై హైకోర్టును ఆశ్రయించామని, ఈ విషయంలో ఈడీ తన క్లయింట్కు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎలాంటి స్కామ్ చేయలేదని కోర్టుకు తెలిపిందని ఆయన వివరించారు. ‘‘నా క్లయింట్కూడా మీడియాకు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈడీ నా క్లయింట్ ఇంట్లో 30 గంటలు సోదాలు చేసినట్లు, ఆయన నేరం చేశారని రుజువు చేసే చాలా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాలన్నీ చూసిన ఈడీ.. నా క్లయింట్ అంటే గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా మీడియాను వాడుకుని దుష్ప్రచారం చేశారని ఈడీ అర్థ చేసుకుంది. ఇదే విషయాన్ని కోర్టుకు ఈడీ తెలిపింది. నా క్లయింట్పై కోపం ఉన్న వాళ్లు చేసిన పని వల్ల ఆయన మానసికంగా కుంగిపోయాడు. ఆయన కూతురి నిశ్చితార్థం సంకటంలో పడింది” అని అడ్వొకేట్ పేర్కొన్నారు. తన క్లయింట్ ఎలాంటి స్కామ్చేయలేదని ఈడీ ఇచ్చిన క్లీన్చిట్ను కూడా పబ్లిష్ చేయాలని మీడియాను ఆయన కోరారు.
బ్లడ్ డొనేషన్ క్యాంప్లు.. బైక్ ర్యాలీలు
గ్రేటర్ వ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవ సంబురాలు కొనసాగుతున్నాయి. సిటీలోని అన్ని ఫైర్ స్టేషన్ల సిబ్బంది బుధవారం చార్మినార్ నుంచి ఉప్పల్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఖైరతా
బాద్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు వాటర్ బోర్డు ఎంప్లాయీస్ చేపట్టిన బైక్ ర్యాలీని ఎండీ దానకిశోర్ ప్రారంభించారు. సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్న, సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మల్కాజిగిరిలోని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బ్లడ్ డొనేషన్ క్యాంప్లను ప్రారంభించారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ 3 డోగ్ర ఆర్మీ సెంటర్లో ఏర్పాటు చేసిన క్యాంప్లో సుమారు 200 మంది జవాన్లు బ్లడ్ డొనేట్ చేశారు. హెల్త్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంహెచ్ వో వెంకటి పాల్గొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటో ఎగ్జిబిషన్ మాదాపూర్లోని శిల్పారామంలో ఏర్పాటైంది. సీబీసీ డైరెక్టర్ జనరల్ ఎస్.వెంకటేశ్వరరావు చీఫ్ గెస్టుగా హాజరై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలను స్మరించుకోవడానికే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 50 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోలు, వారి పోరాటాలకు సంబంధించిన చరిత్రను ఎగ్జిబిషన్లో పెట్టామని..ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
- వెలుగు,మాదాపూర్/మెహిదీపట్నం/సికింద్రాబాద్/మల్కాజిగిరి
ఘనంగా మాజీ మేయర్ బండ కార్తీక బర్త్ డే
సికింద్రాబాద్, వెలుగు: మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ కార్తీకా రెడ్డి బర్త్ డే వేడుకలు తార్నాకలోని ఆమె ఇంట్లో బుధవారం ఘనంగా జరిగాయి. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ చార్జి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు కొంతం దీపిక, పద్మా వెంకట్ రెడ్డి, సునీతా గౌడ్, సుచిత్ర హాజరై బండ కార్తీకకు విషెస్ తెలిపారు. కార్తీకారెడ్డి ప్రజాసేవకు అంకితం కావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు హరి, వీరన్న, ఓబీసీ నాయకులు శ్రీనివాస్,ఎస్టీ మోర్చా నాయకులు దిలీప్, ఎస్సీ మోర్చా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వరాలు ఇస్తాడనుకుంటే బీజేపీని తిట్టి టైం పాస్ చేసిండు
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: అభివృద్ధిలో వెనకబడిన వికారాబాద్ ప్రాంతానికి సీఎం కేసీఆర్ వరాలు కురిపిస్తారనుకుంటే, బీజేపీని తిడుతూ టైం పాస్చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం ప్రసాద్కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన వికారాబాద్ లోని ఇంట్లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బీజేపీని తిట్టడానికే వికారాబాద్ వచ్చినట్టు ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను టకటకా చదివేసి చేతులు దులుపుకున్నారన్నారు. బీజేపీతో పడకపోతే ఓ స్థలం ఎంచుకొని కుస్తీలు పడాలి కానీ ఇలా చేయడం కరెక్ట్కాదన్నారు. ఏదో ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూసిన వికారాబాద్ప్రజలను సీఎం తీవ్రంగా నిరుత్సాహపరిచారని చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలనే కొత్తగా చెప్పి జనం చెవిలో పూలు పెట్టాలని చూశారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల్లో కనీసం 10శాతం నిధులైనా వికారాబాద్ ప్రాంతానికి కేటాయించారా అని ప్రశ్నించారు. జిల్లాలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు జాఫర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా.. ఒకరి అరెస్ట్
ఓయూ, వెలుగు: గోవా కేంద్రంగా డ్రగ్స్దందా నిర్వహిస్తూ సిటీలో వాటిని అమ్మేందుకు యత్నించిన సప్లయర్ ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఓయూ పీఎస్ లో ఈస్ట్ జోన్ డీసీపీ చక్రవర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. గోవాలోని అంజునా ఏరియాలో ఉండే ప్రితీశ్నారాయణ్ అలియాస్ కాళీ(36) కొంతకాలంగా గోవాలో నార్కొటిక్ సింథటిక్ డ్రగ్స్ ను అక్కడి సప్లయర్స్ నుంచి కొని వాటిని మంజూర్ అనే వ్యక్తితో కలిసి బీచ్లలో అమ్ముతున్నాడు. 8 ఏండ్లుగా గోవాలో తన అనుచరుల ద్వారా డ్రగ్స్ అమ్ముతున్న ప్రితీశ్ నారాయణ్2014లో అంజునా బీచ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై గోవా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రితీశ్మళ్లీ డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. మంగళవారం సిటీకి వచ్చిన ప్రితీశ్ హబ్సిగూడ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు, నార్కొటిక్ వింగ్ టీమ్ అక్కడికి చేరుకుంది. ప్రితీశ్ ను అదుపులోకి తీసుకుని విచారించింది. అతడు గోవా, తెలంగాణ, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. రూ. లక్ష విలువైన 20 ఎక్టసిటీ పిల్స్, 5 ఎల్ ఎస్ డీ బ్లాట్స్, 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, సెల్ ఫోన్, రూ.4 వేల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రితీశ్ కు 600 మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. సుమారు 166 మంది వివరాలను సేకరించామని.. మిగతా వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. సమావేశంలో నార్కొటిక్ డ్రగ్స్ విభాగం అడిషనల్ డీసీపీ స్నేహా మెహ్ర, ఇన్ స్పెక్టర్లు రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో బుధవారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు జరిపింది. బంజారాహిల్స్ రోడ్
నం.2లోని ఓ సంస్థ హెడ్డాఫీసుతో పాటు ఏపీ, బెంగళూరులోని మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు అర్ధరాత్రి వరకు జరిగాయి. రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్, వెంచర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. మూడేండ్లుగా ప్రాపర్టీ సేల్స్, ఇన్కమ్, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్లు సమాచారం. అనుమానాస్పద ట్రాన్జాక్షన్లపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
మైసూర్కు చెందిన వ్యాపారి సిటీలో సూసైడ్
లక్డీకపూల్లోని హోటల్ రూమ్లో చెయ్యికోసుకుని ఆత్మహత్య
ఖైరతాబాద్, వెలుగు: మైసూర్ కు చెందిన ఓ వ్యాపారి సిటీలో సూసైడ్ చేసుకున్న ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. మైసూర్ కు చెందిన కిరణ్నారాయణ(46) వ్యాపారి. ఈ నెల 8న సిటీకి వచ్చిన కిరణ్ లక్డీకపూల్ లోని ఓ హోటల్ లో రూమ్ తీసుకుని అదే రోజు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. మళ్లీ 15న అదే హోటల్ కు వచ్చి రూమ్ నం.319లో దిగాడు. కిరణ్హోటల్ లో చేసిన ఖర్చు మొత్తాన్ని అతడి తండ్రి సత్యనారాయణ ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. 17న మధ్యాహ్నం 2 గంటలకు సత్యనారాయణ హోటల్ కు ఫోన్ చేసి తన కొడుకు రూమ్ కు కనెక్ట్ చేయమని కోరాడు. హోటల్ సిబ్బంది కాల్ కనెక్ట్ చేశారు. ఎంతసేపటికీ కిరణ్ఫోన్ ఎత్తకపోవడంతో సర్వీస్ బాయ్ అతడి రూమ్ కు వెళ్లి చూడగా.. డోర్ కు డోంట్ డిస్ట్రర్బ్ అని బోర్డు కనిపించింది. ఇదే విషయాన్ని సర్వీస్ బాయ్ సత్యానారాయణకు చెప్పాడు. అయినప్పటికీ సత్యనారాయణ తన కొడుకుకి కాల్ కనెక్ట్ చేయాలని బలవంతం చేయడంతో హోటల్ మేనేజ్ మెంట్ మాస్టర్ కీతో రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే కిరణ్ చనిపోయి కనిపించాడు. అతడి మణికట్టును కత్తితో కోసుకున్నట్లు గమనించి సైఫాబాద్ పోలిసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. వ్యక్తిగత కారణాలతో కిరణ్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
హాష్ ఆయిల్ అమ్ముతున్న నలుగురు అరెస్ట్
ఖైరతాబాద్, వెలుగు: హాష్ ఆయిల్ అమ్ముతున్న నలుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు గ్రామానికి చెందిన వంగ హేమంత్ ఐటీఐ చదివాడు. సిటీకి వచ్చి ఉప్పరపల్లిలో ఉంటున్నాడు. బంజారాహిల్స్ లో ఉండే సతీశ్, అభిలాష్, భాను ప్రకాశ్, మరో మైనర్ తో హేమంత్ కు పరిచయం ఏర్పడింది. వీరంతా జల్సాలకు బానిసయ్యారు. ఈజీమనీ కోసం హాష్ ఆయిల్ అమ్మేందుకు స్కెచ్ వేశారు. గత నెల హేమంత్ వైజాగ్ కు వెళ్లి దువ్వాడకు చెందిన వెంకట్ నుంచి లీటర్ హాష్ ఆయిల్ కొన్నాడు. దాన్ని సిటీకి తీసుకొచ్చి తన గ్యాంగ్ తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నాడు. బుధవారం బంజారాహిల్స్ లోని ఓ ఖాళీ ప్రదేశం వద్ద హాష్ ఆయిల్ అమ్ముతున్న ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల హాష్ ఆయిల్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ కు చెందిన వెంకట్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.