
భైంసా/బాసర/జీడిమెట్ల, వెలుగు: గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్జిల్లాలోని బాసరలో జరిగింది. హైదరాబాద్కు చెందిన 18 మంది భక్తులు ఆదివారం బాసరకు వచ్చారు. ముందుగా సరస్వతీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సరదాగా గోదావరిలో బోటింగ్చేసేందుకు వెళ్లారు. బోట్లో అవతలి గట్టుకు చేరుకున్న వాళ్లంతా.. అక్కడ స్నానం చేసేందుకు నదిలోకి దిగారు.
ఈ క్రమంలో రాకేశ్ (21), వినోద్ (20), రితిక్ (18), మదన్ (21), భరత్ (20) నీటిలో మునిగిపోయారు. అక్కడ లోతుగా ఉండడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీళ్లలో గల్లంతయ్యారు. కండ్ల ముందే పిల్లలు మునిగిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో కుటుంబసభ్యులు ఉండిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న యాత్రికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు వెంటనే గజ ఈతగాళ్లతో స్పాట్కు చేరుకున్నారు.
ముందుగా నలుగురిని, ఆ తర్వాత మరొకరిని బయటకు తీసి.. సీపీఆర్ చేసి 108 అంబులెన్స్లో భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వాళ్లు మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ స్పాట్కు వెళ్లి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి చేరుకుని డెడ్బాడీలను పరిశీలించారు.
ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు..
మృతి చెందిన ఐదుగురు యువకుల్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోనిచింతల్లో రాజస్థాన్కు చెందిన ప్రేమ్రాజ్రాథోడ్ కుటుంబం కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈయనకు ముగ్గురు కుమారులు రాకేశ్, మదన్, భరత్ ఉన్నారు. కాచిగూడ, దిల్సుఖ్నగర్లో ఉంటున్న బంధువుల కుటుంబాలతో కలిసి ప్రేమ్రాజ్ కుటుంబం బాసరకు వెళ్లింది.
అక్కడ చనిపోయిన ఐదుగురు యువకుల్లో ముగ్గురు ప్రేమ్రాజ్ కుమారులే. ముగ్గురు కొడుకులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, బాధిత కుటుంబసభ్యులు రాజస్థానీలు కావడంతో భైంసాలో ఉన్న రాజస్థానీలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.
ప్రమాద హెచ్చరికల్లేవ్..
తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గోదావరిలో స్నాన ఘట్టాల వద్ద గానీ, బోటింగ్ చేసే సమయంలో గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు సూచనలు చేయడం లేదు. స్నాన ఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే గోదావరి తీరంలో గస్తీ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.