
గండిపేట్, వెలుగు : హైదరాబాద్లో మరో కల్తీ దందా బయటపడింది. రాజేంద్రనగర్ పరిధి హైదర్గూడలోని ఓ కంపెనీలో ప్రమాదకర కెమికల్స్తో కల్తీ చాక్లెట్లను తయారు చేస్తున్నారు. బుధవారం స్థానికులు ఈ కంపెనీపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మీడియా అక్కడికి వెళ్లి పరిశీలించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుప్రజ ఫుడ్స్ పేరుతో నిర్వాహకులు కల్తీ దందా చేస్తూ అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో కల్తీ చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
తయారీలో ప్రమాదకర కెమికల్స్ వాడుతున్నారని, మురికిగా ఉన్న ప్రదేశంలో చాక్లెట్లను తయారు చేస్తున్నారన్నారు. ఈ కంపెనీకి బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, కల్తీ దందా విషయం బయటికి రావడంతో నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారు. కల్తీ దందాపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తామని అత్తాపూర్ పోలీసులు తెలిపారు.