
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీటీడీ సీవీ, ఎస్వో మురళీకృష్ణ విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని... బ్రహ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు మురళీకృష్ణ.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు తిలకించేంచేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్లాట్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.