జీపీ లేఅవుట్లే ల‌‌క్ష్యంగా క‌‌బ్జాలు .. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో సగానికిపైగా ఇవే

జీపీ లేఅవుట్లే ల‌‌క్ష్యంగా క‌‌బ్జాలు .. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో సగానికిపైగా ఇవే

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ శివారుల్లో గతంలో వేసిన పంచాయతీ లే-అవుట్లకు రక్షణ లేకుండా పోయిందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రోడ్లు, పార్కుల హద్దులను చెరిపేసి వ్యవసాయ భూములుగా మార్చేశారని ఆరోపించారు. ఇదేంటని అడిగితే ధరణి ద్వారా తెచ్చుకున్న పాసు పుస్తకాలు చూపించి దబాయిస్తున్నారన్నారు. సోమ‌‌వారం హైడ్రా ఆఫీస్​లో నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు రాగా, ఇందులో 60 శాతానికి పైగా పాత లేఅవుట్లపైనే ఉన్నాయి. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.

  • రంగారెడ్డి జిల్లా ఘ‌‌ట్​కేస‌‌ర్ మండ‌‌లం కొర్రెములలోని సర్వే నంబర్ 739 నుంచి 749 వ‌‌ర‌‌కు మొత్తం149 ఎక‌‌రాల్లో 1987లో 2080 ప్లాట్లతో ప్రొఫెసర్ జ‌‌య‌‌శంక‌‌ర్ ఏక‌‌శిలా కాల‌‌నీ లేఅవుట్​వేశారు. ఇందులోని నాలుగు స‌‌ర్వే నంబ‌‌ర్లలో 47 ఎక‌‌రాల భూమి తమదంటూ ఆలూరి వెంక‌‌టేశ్ తో పాటు మ‌‌రికొంద‌‌రు ధరణి ద్వారా పాస్​పుస్తకాలు సంపాదించి క‌‌బ్జా చేశార‌‌ని బాధితులు ఫిర్యాదు చేశారు. 
  • అబ్దుల్లాపూర్ మెట్ మండ‌‌లం పెద్ద అంబర్ పేటలో 264, 265, 266 స‌‌ర్వే నంబ‌‌ర్లలో 500 ప్లాట్లతో ఉన్న శ్రీ బాలాజీ న‌‌గ‌‌ర్ లేఅవుట్​ఆ త‌‌ర్వాత శ్రీ సాయిన‌‌గ‌‌ర్ కాల‌‌నీ లే అవుట్​గా మారిపోయింద‌‌ని పాత లేఅవుట్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రిట్ పిటిష‌‌న్ 33331/2018 ద్వారా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా ప్రయోజ‌‌నం లేక‌‌పోయింద‌‌ని వాపోయారు. ఇందులోని 40 అడుగుల మెయిన్​రోడ్డును మూసివేయడంతో ఔట‌‌ర్ రింగురోడ్డును, విజ‌‌య‌‌వాడ హైవేకు దారి లేకుండా పోయిందని కాలనీవాసులు  ఫిర్యాదు చేశారు.  
  •  మేడ్చల్ – మ‌‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌‌లం రెడ్డి ఎన్‌‌క్లేవ్‌‌లో 2460 గ‌‌జాల పార్కు స్థలం ఉండగా, ఇందులో 667 గ‌‌జాల స్థలాన్ని క‌‌బ్జా చేశార‌‌ని ఆ కాల‌‌నీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 
  • మెహిదీప‌‌ట్నం -మ‌‌ల్లేప‌‌ల్లి మార్గంలోని ఆసిఫ్‌‌న‌‌గ‌‌ర్‌‌లో ద‌‌ర్గా భూమిని కూడా క‌‌బ్జాదారులు వ‌‌ద‌‌ల‌‌డం లేద‌‌ని, 3800 గ‌‌జాల స్థలం త‌‌న‌‌ద‌‌ని ఓ వ్యక్తి క‌‌బ్జా చేశారంటూ ద‌‌ర్గా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.