సంధ్య కన్స్ట్రక్షన్స్ అక్రమ నిర్మాణాలు నేలమట్టం

సంధ్య కన్స్ట్రక్షన్స్  అక్రమ నిర్మాణాలు నేలమట్టం
  • ఎఫ్​సీఐ లేఅవుట్లలో ప్లాట్లు ఆక్రమించి భవనాలు నిర్మించిన కన్​స్ట్రక్షన్​ ఎండీ శ్రీధర్​ 
  •  గతంలో హైడ్రా చర్యలు తీసుకున్నా మరోసారి  నిర్మాణాలు
  • హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో సంధ్య కన్​స్ర్టక్షన్స్​ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. ఎఫ్​సీఐ లేఅవుట్​లో రోడ్లు, ప్లాట్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో 1981లో 20 ఎకరాల్లో ఎఫ్​సీఐ కోఅపరేటివ్​ హౌజింగ్ సొసైటీ లేఅవుట్​ చేసి ఆ సంస్థలో పనిచేసే వారికి 162 ప్లాట్లు కేటాయించింది. ఈ లేఅవుట్​ను ఆనుకొని సంధ్య కన్వెన్షన్​ ఉండగా, ఎండీ శ్రీధర్​ కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసి మిగతా ప్లాట్ల హద్దులను చెరిపేశాడు.

 దీంతో 119 మంది బాధితులు ఆయనకే ప్లాట్లు అమ్ముకున్నారు. మరో 43 ప్లాట్లను శ్రీధర్​రావు కబ్జా చేసి భవనాలు నిర్మించాడు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు మే 7న పలు నిర్మాణాలను కూల్చివేశారు. అయినా శ్రీధర్​ మరోసారి నిర్మాణాలు చేపట్టాడు. ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు భారీ హైడ్రాలిక్​ యంత్రంతో ఎఫ్​సీఐ లేఅవుట్​లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. 40 అడుగుల రోడ్డును ఆక్రమించి చేపట్టిన 4 అంతస్తుల బిల్డింగ్​, భారీ ఫుడ్​ కోర్టు, మెయిన్​ రోడ్డు వెంట ఉన్న పెట్రోల్​ బంకు, 25 ఫీట్​ రోడ్డును ఆక్రమించి నిర్మించిన 40 ఫుడ్​ కంటైనర్లను, ఓ దవాఖాన కోసం నిర్మిస్తున్న బిల్డింగ్​ స్లాబ్​లను కూల్చివేశారు. త్వరలోనే ఎఫ్​సీఐ లేఅవుట్​ రోడ్లు, ప్లాట్లను పునరుద్ధరించి హద్దులు ఏర్పాటు చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.