సినిమా షూటింగ్ చూడటానికి వెళ్తే ..ప్రాణాలే పోయాయి

సినిమా షూటింగ్ చూడటానికి వెళ్తే ..ప్రాణాలే పోయాయి

బెంగళూరు: సినిమా షూటింగ్ హైడ్రోజన్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన శనివారం బెంగళూరులో జరిగింది. కన్నడ సినిమా ‘రణం’ సెట్‌ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది సినిమా యూనిట్. షూటింగ్ స్పాట్ లోని  హైడ్రోజన్‌ సిలిండర్‌ పేలడంతో ఓ మహిళ, చిన్నారి మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసులు.. “బెంగళూరులోని బగళూర్‌లో ‘రణం’ షూట్‌ జరుగుతోంది. సుమనా భాను (మృతురాలు) తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా షూటింగ్‌ చూడటానికి వెళ్లారు. ఇదే సమయంలో షూట్‌ లో భాగంగా హైడ్రోజన్‌ సిలిండర్‌ను పేల్చారు. ఈ ప్రమాదంలో సుజనా భాను, ఆమె కుమార్తె ఆయేషా అక్కడికక్కడే మృతి చెందారు. సుజనా భర్త సిలిండర్‌కు దూరంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటనతో నిర్మాతలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ‘రణం’ సినిమాలో చేతన్‌ అహింస, వరలక్ష్మి శరత్‌కుమార్‌, చిరంజీవి సర్జా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వి. సముద్ర డైరెక్టర్. ఈ సినిమాలోని స్టంట్‌ సీక్వెన్స్‌ ను షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రెండు కార్లు ఢీకొనే యాక్షన్‌ సీన్‌ కోసం సిలిండర్‌ ను వాడారు. నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ఇద్దరి ప్రాణాలు బలయ్యాయని సీరియస్ అవుతున్నారు మృతుల ఫ్యామిలీ మెంబర్స్.