సీఎం కేసీఆర్ కంటే నేను ఎక్కువ చదువుకున్న : రసమయి బాలకిషన్

 సీఎం కేసీఆర్ కంటే నేను ఎక్కువ చదువుకున్న  : రసమయి బాలకిషన్

కరీంనగర్:  సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల  కంటే తాను ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్ లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్న రసమయి బాలకిషన్.. తాను కూడా అంబేద్కర్ మాదిరిగానే చదువుకుని డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించానని చెప్పారు. పేద దళిత కుటుంబంలో పుట్టిన తాను.. ఉన్నత చదువులు చదువుకుని డాక్టర్ రసమయి బాలకిషన్ గా మీ ముందు నిల్చున్నానని చెప్పారు. తాను టీచర్ గానూ పని చేశానని, గోచి, గొంగడి పెట్టుకుని పాటలు పాడానని రసమయి తెలిపారు. 

మరోవైపు.. కరీంనగర్ జిల్లాలోని గద్దపాక గ్రామంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన రసమయి బాలకిషన్ ను అఖిలపక్షం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటారా..? అంటూ అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.