సవాలుతో కూడిన పోటీ ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో ఆడా..

సవాలుతో కూడిన పోటీ ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో ఆడా..

జావెలిన్ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడాన‌ని భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా జావెలిన్ తెలిపాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో ద్వితీయ‌ స్థానంలో నిలిచిన నేపథ్యంలో...రజత ప‌త‌కం సాధించినందుకు గ‌ర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఇక్కడ వాతావ‌ర‌ణ ప‌రిస్థితి అంత అనుకూలంగా లేదని, గాలుల తీవ్రత అధికంగా ఉంద‌ని చెప్పాడు. ఆటలో తాను ఎలాంటి ఒత్తిడికీ గురి కాలేదని, ప్రతిసారి బంగారు పతకం సాధించడం కుదరదని చెప్పాడు. తాను మూడో ప్రయత్నం తర్వాత కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నానని నీరజ్ చోప్రా తెలిపాడు. ఈ పోటీ తనకు చాలా అనుభవం నేర్పిందన్న నీరజ్.. భవిష్యత్తులో స్వర్ణం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశాడు. ఈ విజయం పట్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పోటీల్లో పాల్గొన్నవారందరూ బాగా రాణించార‌ని, దీంతో పోటీ తీవ్రంగా మారిందని.. కానీ అది కూడా తన మంచికేనని నీరజ్ చెప్పాడు.

 

నీరజ్ చోప్రా విజయం సాధించడంపై ఆయన తండ్రి సతీష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చాలా గొప్ప విజయంగా అభివర్ణించారు. నీరజ్ సృష్టించిన రికార్డుతో దేశం గర్విస్తోందన్నారు. వచ్చేసారి స్వర్ణం గెలుస్తాడని ఆశిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక నీరజ్ చోప్రా రజత పతకం సాధించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందనలు తెలియజేశారు. పలువురు ప్రముఖులు కూడా ఆయన్ని కొనియాడుతూ.. సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు. ఇక నీరజ్ స్వస్థలమైన పానిపట్ లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.