న్యూఢిల్లీ: తన హయాంలో ఐసీసీ ట్రోఫీ గెలవనందుకు తనపై ఫెయిల్డ్ కెప్టెన్ అని ముద్ర వేశారని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. మెగా టోర్నీల్లో ఇండియాను సెమీస్, ఫైనల్ వరకు తీసుకెళ్లినా, దాన్నీ ఫెయిల్యూర్గానే భావించారన్నాడు. ‘టోర్నీలు గెలిచేందుకే మనం ఆడతాం. నా కెప్టెన్సీలో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడాం. 2019 వరల్డ్కప్లో సెమీస్ వరకు వెళ్లాం. 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ఆడినా, గత టీ20 వరల్డ్కప్లో నాకౌట్కు చేరలేకపోయాం. ఈ నాలుగు టోర్నీల తర్వాత కెప్టెన్గా నేను ఫెయిల్ అని ముద్ర వేశారు. కానీ, ఆ కోణంలో నన్ను నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. కానీ టీమిండియా కల్చర్లో మార్పు తీసుకొచ్చినందుకు చాలా గర్వపడుతున్నా. జట్టుగా మేం ఏం సాధించామో, మా ఆట తీరులో వచ్చిన మార్పులేంటో అందరికీ తెలుసు. టోర్నీలు ఫలానా టైమ్లోనే జరిగిపోతాయి. కానీ టీమ్ కల్చర్, ఆటలో మార్పు అనేది సుదీర్ఘకాలం ఉంటుంది. అలా జరగాలంటే ఓ టోర్నీలో విజయం సాధించే వారికంటే ఎక్కువ మంది అవసరం. నిలకడ కూడా చాలా ప్రధానం. ఓ ప్లేయర్గా నేను వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచా. ఐదుసార్లు టెస్టు గద (టెస్ట్ల్లో నం.1 ర్యాంక్) నెగ్గిన టీమ్లోనూ మెంబర్ని. ఈ కోణంలో చూస్తే ఎప్పుడూ వరల్డ్కప్ గెలవని ప్లేయర్లు కూడా చాలా మందే ఉన్నారు’ అని కోహ్లీ ఆర్సీబీ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
ధోనీ ఒక్కడే..
ఫామ్లో లేనప్పుడు, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ఎంఎస్ ధోనీ అని విరాట్ అన్నాడు. అందుకే మహీతో తన బంధం విడదీయరానిదన్నాడు. ‘నేను ఫామ్ కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుష్క, నా ఫ్యామిలీ, చిన్ననాటి కోచ్ కాకుండా నాతో మాట్లాడిన ఏకైక వ్యక్తి ధోనీ. అతనితో నాకు 11 ఏళ్ల అనుబంధం ఉంది. ధోనీ ఇతరులకు చాలా అరుదుగా అందుబాటులో ఉంటాడు. నేను ఎప్పుడైనా కాల్ చేసినా 99 శాతం ఫోన్ తీయడు. ఎందుకంటే తను మొబైల్ ఎక్కువగా ఉపయోగించడు. అలాంటి వ్యక్తి నాకు స్వయంగా మెసేజ్ చేశాడు. ఇప్పటివరకు రెండుసార్లు అలా జరిగింది. నాపై విమర్శలు వచ్చినప్పుడు మహీ చేసిన మెసేజ్ నా మనసును తాకింది. నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు, ధృడమైన వ్యక్తిగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఆడుతున్నావు? అని అడగటం ప్రజలు మర్చిపోతారని ధోనీ చెప్పాడు. ఆ మాటలు నాపై బలంగా పని చేశాయి. నేను కూడా ఆత్మవిశ్వాసంతో, మానసికంగా బలంగా ఉండాలని కోరుకుంటా. కానీ జీవితంలో ఏదో ఓ దశలో ఓ రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటిని అధిగమిస్తేనే ఉన్నతంగా రాణిస్తాం. ఆటలో బలంగా ఉన్న వ్యక్తులే మన బాధలను అర్థం చేసుకోగలుగుతారు. ధోనీ కూడా అంతే. ఆ క్షణాల్లో నా భావోద్వేగాలను అతను అర్థం చేసుకోగలిగాడు’ అని విరాట్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు కూడా మహీ తనకు మెసేజ్ చేశాడన్నాడు.
నేను చాలా లక్కీ
2011 వన్డే వరల్డ్కప్ నెగ్గిన టీమ్లో ఉండటం తన అదృష్టమని విరాట్ చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ టైమ్లో టీమ్లో నాకు ప్లేస్ దొరకడమే లక్కీ అనొచ్చు. నా ఎంపిక కూడా అద్భుతంగా జరిగింది. ఏదేమైనా సచిన్ ఐదు ప్రయత్నాల తర్వాత వరల్డ్ కప్ గెలిచాడు. కానీ నేను ఫస్ట్ టైమే కప్ గెలిచిన టీమ్లో మెంబర్ని. నా ఖాతాలో ఎక్కువ ట్రోఫీలు ఉండాలన్న పిచ్చి నాకు లేదు. కానీ ఓ అద్భుతమైన టీమ్లో మెంబర్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.