ఆర్టీసీని బతికించుకుంటా.. గాడిన పెట్టేదాకా నిద్రపోను

ఆర్టీసీని బతికించుకుంటా.. గాడిన పెట్టేదాకా నిద్రపోను

హైదరాబాద్: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగు వేయకుండా ఆర్టీసిని తిరిగి బతికించుకుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల  ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది.  ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎల్ ఐ సి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది.,, అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కుపోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటోంది.. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకుని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను… నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట.. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి.. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ  కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలని అనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా  అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటకే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..’’ అని సిఎం స్పష్టం చేశారు.

కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన  కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోయిందని.. దీని వల్ల ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సూచించారు.

ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని  ఈ సందర్బంగా సిఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవల తో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అదనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ సిటీలో సర్వీసులు పెంచండి-కేసీఆర్

‘‘ కరోనా అనంతర పరిస్థితుల నుంచి ఒక్కొక్క వ్యవస్థ గాడిన పడుతున్నది.. ప్రజలు ఇప్పుడిప్పుడే భయం లేకుండా బైటికొస్తున్నరు. హోటల్లు దాబాలు తదితర ప్రజావసరాల రంగాలు తిరిగి కోలుకుంటున్నవి. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంబించాలో లోతుగా చర్చించండి.’’ అని సిఎం అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైదరాబాద్ కు  జిల్లాలనుంచి వచ్చి పోయే  ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుతుందని, అందుకోసం హైదరాబాద్ లో  బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, ఆర్టీసి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.