- ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూముల వ్యవహారంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో వారు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.
నాగారం భూములపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్లు రవి గుప్త, తరుణ్ జోషి, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య జ్ఞానముద్ర తదితరులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం.. అధికారులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. సర్వే నం.194, 195లో భూములను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
