టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇండియాలో ఆడుతుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 2026 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లడం ఇష్టం లేదని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇండియా నుంచి తరలించడానికి ఐసీసీ అంగీకరించకపోయినా.. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం (జనవరి 13) మరోసారి స్పష్టం చేసింది.
తాజా సమాచార ప్రకారం ఐసీసీ బంగ్లాదేశ్ కు మరోసారి ఆలోచించుకోమని అవకాశం ఇచ్చింది. బుధవారం (జనవరి 21) లోపు తమ సమాధానాన్ని చెప్పాల్సిందిగా డెడ్ లైన్ విధించింది. ESPNcricinfo నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ఇండియా రావడానికి నిరాకరిస్తే టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఉండదు. బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టు వరల్డ్ కప్ ఆడుతుంది. ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్ స్థానంలో ఆడనుంది. భద్రతా సమస్యల వల్లే ఇండియాలో పర్యటించేందుకు తాము వెనకడుగు వేస్తున్నామని బంగ్లాదేశ్ బోర్డు ఇప్పటికే చాలాసార్లు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. సాధ్యమైన పరిష్కారం కోసం మరోసారి ఐసీసీతో చర్చలు జరుపుతామని తెలిపింది.
‘టోర్నీ షెడ్యూల్, ట్రావెల్ ప్లాన్స్, విమాన టిక్కెట్లు అన్నీ రెడీ అయ్యాయని ఐసీసీ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేదికలు మార్చడం సాధ్యం కాదని వెల్లడించింది. అయినప్పటికీ మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మేం కూడా స్పష్టంగా చెప్పాం. మా ప్లేయర్లు, సిబ్బందిని కాపాడుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఈ అంశంలో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీసీబీ పేర్కొంది. ఐసీసీ ఇచ్చిన డెడ్ లైన్ కు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడనుంది. మూడు కోల్కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
