కిషన్గంజ్(బిహార్): దేశంలో హింసను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. మతం, కులం, భాష పేరుతో కొట్లాడుకునేలా ప్రజలను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. అన్నదమ్ములే తమలో తాము కొట్టుకునే వాతావరణం ఆర్ఎస్ఎస్, బీజేపీలు సృష్టించాయని విమర్శించారు. అందుకే తాము ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం జరగాలని పని చేస్తున్నామని వెల్లడించారు. రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సోమవారం బెంగాల్ నుంచి కిషన్గంజ్ మీదుగా బిహార్లోకి చేరుకున్నది. బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇండియా కూటమి నుంచి ఎన్డీయే కూటమితో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే.. రాహుల్ యాత్ర బిహార్లోకి ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్బిహార్లో పర్యటించడం ఇదే తొలిసారి. కిషన్గంజ్లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో వివిధ మతాలు, కులాలకు చెందిన ప్రజలు తమలో తాము పోరాడుతున్నారని అన్నారు. ‘‘భారతదేశంలో అత్యధిక జనాభా ఓబీసీలు అని దేశం మొత్తానికి తెలుసు. ఆ తర్వాత దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతున్నారు. వారు యూనియన్ బడ్జెట్ను నియంత్రిస్తారు. ఆ 90 మంది అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. బడ్జెట్లో చాలా తక్కువ డబ్బు కేటాయింపులు జరుగుతున్నాయి. అందుకే మేము ఒక విప్లవాత్మక మార్పు కోసం ప్రశ్నిస్తున్నాం. బీసీలు, దళితుల నిజమైన జనాభా ఎంత అనేది ఇప్పుడు భారతదేశం తెలుసుకోవాలి. అందుకే మేము దేశంలో కుల గణనను కోరుకుంటున్నాం”అని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
యూజీసీ ‘డీరిజర్వేషన్’ను ఖండిస్తున్నం
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్డ్ అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి అర్హత కలిగిన వ్యక్తులు లేకుంటే.. ఆ పోస్టులను డీ రిజర్వ్ చేసి ఓపెన్ పోస్టులుగా మార్చాలని తాజాగా యూజీసీ తీసుకొచ్చిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. డీ -రిజర్వేషన్ మార్గదర్శకాలపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ను తొలగించాలని కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేసే కుట్ర జరుగుతోంది”అని ఆరోపించారు.