ఒక వ్యక్తికి కరోనా సోకితే అతడు లాక్ డౌన్ ను ఫాలో అవ్వకున్నా లేదా సోషల్ డిస్టెన్స్ పాటించకున్నా 30 రోజుల్లో మరో 406 మందికి అంటిస్తాడని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇటీవల భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ జరిపిన స్టడీలో ఆందోళనకర విషయం తేలిందన్నారు. ప్రజలంతా లాక్ డౌన్ తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనల్ని పక్కాగా పాటించడం ద్వారా వైరస్ ఎవరికైనా సోకినా.. ఆ వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించకుండా కట్టడి చేయొచ్చని, కరోనా చైన్ కు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం మీడియాతో మాట్లాడారు.
326 మంది డిశ్చార్జ్
మంగళవారం ఉదయం వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,421కి చేరిందని తెలిపారు లవ్ అగర్వాల్. గడిచిన 24 గంటల్లోనే 354 కొత్త కేసులు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తంగా 326 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి అదుపు తప్పినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అగర్వాల్. రైల్వే శాఖ ఇప్పటికే 2500 రైలు కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చిందని, 40 వేల బెడ్ లను ట్రీట్మెంట్ కు అనుకూలంగా రెడీ చేసిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 133 చోట్ల రోజుకు 375 ఐసోలేషన్ బెడ్లను రైల్వే శాఖ సిద్దం చేస్తోందని చెప్పారు. క్టస్టర్ స్ప్రెడ్ ను అరికట్టేందు ప్రభుత్వం కొత్త స్ట్రాటజీని అనుసరిస్తోందని చెప్పారు లవ్ అగర్వాల్. ఈ విధానం ఇప్పటికే ఆగ్రా, ఈస్ట్ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. ఈ విధానాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేస్తామన్నారు.
లక్ష టెస్టుల పూర్తి
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,07,006 టెస్టులు పూర్తి చేసినట్లు తెలిపారు ఐసీఎంఆర్ అధికారి గాంగాఖేద్కర్. దేశ వ్యాప్తంగా 136 ప్రభుత్వ ల్యాబ్స్, 59 ప్రైవేటు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.