హైదరాబాద్: రాష్ట్రంపై తోడేళ్ల మందలా పడితే ఊరుకోబోనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తానెక్కడ ఉన్నానని అంటున్నారని.. అసలు నువ్వెక్కడ ఉన్నావని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ఉద్యమం టైమ్లో బండి సంజయ్ పత్తానే లేదన్నారు. బీజేపీని వదిలే ప్రసక్తే లేదని.. గారడీ చేస్తామంటే వదలమని వార్నింగ్ ఇచ్చారు.
‘తెలంగాణకు మేం కాపాలాదారులం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి, బండి సంజయ్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు, ఎన్నో పథకాలు అందేలా చేస్తున్నాం. రాష్ట్రంలో మిషన్ భగీరథ అందని ఇల్లు ఉందా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి పథకం ఉందా? పెట్రో రేట్ల గురించి అడిగితే అఫ్గానిస్థాన్ పొమ్మంటారు. మేం ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామంటారు. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టే మేం పరిపాలన చేస్తున్నాం. కర్నాటక, మధ్యప్రదేశ్లో ప్రజల తీర్పును శిరసా వహించుకుండా.. దొడ్డి దారిన ప్రభుత్వాలు కూల్చి పాలిస్తోంది బీజేపీ కాదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పా? తెలంగాణలో 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. మొన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ మాట వింటే మంచోళ్లు.. మిమ్మల్ని ప్రశ్నిస్తే, నిలదీస్తే దేశద్రోహులు అంటారా? దేశద్రోహి స్టాంప్ వేసి వారంలో ఇన్కం ట్యాక్స్తో రెయిడ్స్ జరుపుతారు. అక్రమంగా కేసులు పెడతారు. పెట్రో రేట్లపై సెస్లు పెంచి ధర పెరిగేలా చేసింది మీరు కాదా?’ అని కేసీఆర్ క్వశ్చన్ చేశారు.