
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను బాంబులు పెట్టి పేల్చేస్తానంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ అయిన దీనిపై యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపేస్తామంటూ బెదిరిస్తూ చేసిన ట్వీట్ గురించి పోలీస్ హెల్ప్లైన్ 112కి సమాచారం అందింది. ట్విట్టర్లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో కావాలని ఈ పోస్ట్ పెట్టారు. అయితే ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అయ్యుండొచ్చు. సొంత పేరుతో కాకుండా ఫేక్ యూజర్ నేమ్తో ఆ ఖాతాను నడుపుతున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అసలైన నిందితుడిని పట్టుకునే వరకు ఆ పేరును బయటపెట్టడం సరైనది కాదు” అని డీసీపీ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని తమ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే ట్విట్టర్ను సంప్రదించిందని చెప్పారు. నిందితుడి వివరాలను సేకరించి, దర్యాప్తులో ముందుకు వెళ్తామన్నారు.