పిల్లలు పుడితే అందం పోతుందని.. అబార్షన్లు చేయిస్తుండు

పిల్లలు పుడితే అందం పోతుందని.. అబార్షన్లు చేయిస్తుండు
  • శాడిస్ట్ భర్తతో వేగలేను.. పోలీసులకు బాధితురాలి కంప్లైంట్

గద్వాల, వెలుగు : వరకట్న వేధింపులతో పాటు డెలివరీ అయి పిల్లలు పుడితే అందం పోతుందని ఐదేండ్లుగా మెట్టినింట్లో భర్త నరకం చూపించాడని గద్వాల జిల్లా కేంద్రంలోని గంటగేరికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. గద్వాల పట్టణం గంటగేరికి చెందిన శ్వేతను మల్దకల్  మండలం శేసంపల్లికి చెందిన విజయ్​కుమార్​కు ఇచ్చి ఐదేండ్ల కింద పెండ్లి చేశారు. అప్పటి నుంచి భర్త వేధిస్తున్నాడని, ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలవగానే, పిల్లలు పుడితే తన అందం పోతుందని ఐదేండ్లలో రెండుసార్లు అబార్షన్​ చేయించాడని బాధితురాలు పేర్కొంది. తన భర్త శాడిజానికి తోడు అత్తమామలు కూడా నరకం చూపేవారని వాపోయింది.

కాగా, బాధితురాలు  మూడు రోజుల కింద కంప్లయింట్​ చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేసి  విషయాన్ని రహస్యంగా ఉంచారు. నిందితుడి తండ్రి బీఆర్ఎస్  లీడర్  కావడంతో కేసు కాకుండా చూసేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఒత్తిడితో పోలీసులు ఎఫ్ఐఆర్  చేసినా, విషయం మాత్రం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆమెకు న్యాయం చేయాలని మహిళా సంఘాల లీడర్లు డిమాండ్  చేస్తున్నారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని టౌన్​ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.