- రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి
- హైకోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. ప్రాజెక్ట్ అక్రమాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్రం లేదా హైకోర్టు/సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే తమకు విచారణ చేసే అధికారం ఉంటుందని చెప్పింది. కాళేశ్వరం విషయంలో దాఖలైన పిటిషన్పై దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశిస్తే.. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని సీబీఐ ఎస్పీ డి.కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులివ్వాలని బి.రాంమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సీబీఐ తరఫున కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటివరకు తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం లేదా కాళేశ్వరానికి నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి గానీ ఫిర్యాదులు ఏమీ అందలేదన్నారు. ప్రభుత్వం లేదంటే కోర్టులు ఆదేశిస్తే తప్ప రాష్ట్ర వ్యవహారాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయలేమని వివరించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, బ్యాంకుల మోసాలు, స్టాక్ ఎక్స్చేంజ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల వ్యవహారాలపై తాము దర్యాప్తు చేసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఇన్వెస్టిగేషన్ టీమ్ అవసరం
కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుకు ఆదేశిస్తే.. అందుకు అవసరమైన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేలా రాష్ట్రానికి ఆదేశాలివ్వాలని హైకోర్టును సీబీఐ ఎస్పీ కల్యాణ్ చక్రవర్తి కోరారు. దర్యాప్తునకు మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ అవసరమని చెప్పారు. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, సిబ్బంది, ఆఫీసు, వెహికల్స్ను రాష్ట్రం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మరోవైపు కాళేశ్వరం నిధుల స్వాహాపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలనే పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన కౌంటర్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 25న విచారణ జరగనుంది.