వడ్డీ రేట్లు పెరిగితే ఇంటి కొనుగోలు ప్రపోజల్​ వాయిదా వేసుకోవాల్సిందే

వడ్డీ రేట్లు పెరిగితే ఇంటి కొనుగోలు ప్రపోజల్​ వాయిదా వేసుకోవాల్సిందే

ముంబై: వడ్డీ రేట్లు మరింత పెరిగితే తమ ఇంటి కొనుగోలు ప్రపోజల్​ వాయిదా వేసుకోవాల్సి వస్తుందని బయర్లు అంటున్నారు. సీఐఐ–ఎనరాక్​ నిర్వహించిన ఒక సర్వేలో 96 శాతం మంది ప్రాస్పెక్టివ్​ బయ్యర్లు ఈ అభిప్రాయం వెల్లడించారు. మొత్తం 4,662 మందిపై సర్వేను నిర్వహించారు.  ది హౌసింగ్​ మార్కెట్​ బూమ్​ పేరిట రిపోర్టును   ముంబైలో జరిగిన సీఐఐ రియల్​ ఎస్టేట్​ కాన్​ఫ్లుయెన్స్​ 2023 సందర్భంగా రిలీజ్​ చేశారు. హోంలోన్లపై  వడ్డీరేట్లు పెరిగితే ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 96 శాతం మంది వెల్లడించినట్లు ఎనరాక్​ తెలిపింది. తాజా మానిటరీ పాలసీ మీటింగ్​లో ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుదలను తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రాపర్టీలు కొనాలనుకునే వారిలో 80 శాతం మందికి హోమ్​లోన్​ వడ్డీ రేట్లతోపాటు, ప్రాపర్టీల  ధరలే ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి.  గత ఏడాది కాలంగా ప్రాపర్టీల బేసిక్​ కాస్ట్​ పెరుగుతూ వస్తోంది. పెద్ద ఇండ్లు కావాలనుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది 3 బీహెచ్​కే ఇష్టపడుతుండగా,  40 శాతం మంది 2 బీహెచ్​కే, 12 శాతం మంది 1 బీహెచ్​కే, 6 శాతం మంది 3 బీహెచ్​కే కంటే పెద్ద ఇండ్లు కావాలనుకుంటున్నారని రిపోర్టు వివరించింది.

నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​లో ప్రాపర్టీలు కొనాలనుకునే వారిలో 45 శాతం మంది సమీప భవిష్యత్​లో 3 బీహెచ్​కే కొనాలనుకుంటున్నారు.  ప్రాపర్టీలు బాగా ఖరీదైన ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​లో 43 శాతం మంది 2 బీహెచ్​కే చాలనుకుంటున్నట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది. కానీ, మరో 32 శాతం మంది మాత్రం 3 బీహెచ్​కేలను ఇష్టపడుతున్నట్లు తెలిపింది.  ప్రాపర్టీ కొందామనుకునే వారిలో 58 శాతం మంది రూ. 45 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల మధ్యలో ప్రాపర్టీలను చూస్తున్నారని, ఎక్కువ మంది ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యే ఇల్లే కొనాలనుకుంటున్నారని సీఐఐ–ఎనరాక్​ సర్వే రిపోర్టు పేర్కొంది. ప్రాస్పెక్టివ్​ బయ్యర్ల నిర్ణయంపై వడ్డీ రేట్ల పెరుగుదల ఇప్పటికే ఎఫెక్ట్​ చూపిస్తోంది, ఇప్పుడు సాగుతున్న  ఉద్యోగాల కోతలు రాబోయే నెలల్లో  ఎంతో  కొంత ఎఫెక్ట్​ చూపిస్తాయని  ఎనరాక్​ ఛైర్మన్​ అనుజ్​పురి చెప్పారు. కానీ, చాలా మందికి సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక మాత్రం టాప్​ ప్రయారిటీగానే కొనసాగుతోందని ఆయన   వివరించారు.