రూల్స్​ పాటించకుంటే.. ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు

రూల్స్​ పాటించకుంటే..  ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు

“వర్సిటీ గైడ్​లైన్స్ బాగున్నా, కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీకి సంబంధించి సెలవులు, ఇన్సూరెన్స్ పైనా వర్సిటీ మేనేజ్​మెంట్లకు స్పష్టమైన ఆదేశాలిస్తే బాగుండు” – బాలకృష్ణారెడ్డి, టీటీఐఈఏ  ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ప్రొఫెషనల్​ కాలేజీల నిబంధనలను జేఎన్టీయూ మరింత కఠినం చేసింది. వర్సిటీ ఆదేశాలను పాటించని కాలేజీల గుర్తింపు రద్దుచేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి వర్సిటీ విడుదలచేసిన రూల్స్ అండ్​ రెగ్యులేషన్స్ లో ఈ వివరాలు వెల్లడించింది. వర్సిటీ అధికారుల తనిఖీల్లో ఏ తప్పు బయటపడ్డా మేనేజ్​మెంట్లదే బాధ్యతని స్పష్టంచేసింది. జేఎన్టీయూ పరిధిలో 300లకు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. వీటిలో పలు కాలేజీలు ఏఐసీటీఈ, పీసీఐ, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడంలేదు. ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులందరికీ బయోమెట్రిక్​ అటెండెన్స్ తప్పనిసరిచేసినా కాలేజీలు అమలు చేయడంలేదు. దీంతో ఈ ఏడాది విధిగా బయోమెట్రిక్​ అటెండెన్స్​మెయింటెన్ చేసిన కాలేజీలకు మాత్రమే గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది. ఫ్యాకల్టీ​ సర్టిఫికెట్లను చెక్​ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్​మెంట్లదేనని పేర్కొంది. వర్సిటీ అధికారుల తనిఖీలలో ఫ్యాకల్టీ సర్టిఫికెట్లు ఫేక్​అని తేలితే ఆయా కోర్సులను రద్దు చేస్తామని తెలిపింది. ఎకడమిక్​ ఇయర్​ మధ్యలో ఫ్యాకల్టీ మానేస్తే.. 15 రోజుల్లోగా కొత్తవారిని తీసుకుని, ఆ వివరాలను వర్సిటీ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలని ఆదేశించింది. ఫ్యాకల్టీకి రెగ్యులర్​గా జీతాలివ్వాలని, యూజీసీ సూచించిన సర్టిఫికెట్లు మినహా ఇతర సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకోవద్దని తెలిపింది. ఆన్​లైన్​ ఫిర్యాదులను వారంలో పరిష్కరించాలని, గవర్నింగ్ బాడీల సమావేశం రెగ్యులర్​గా నిర్వహించాలని పేర్కొంది.

బీటెక్​లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్..

ఈ విద్యాసంవత్సరం కొన్ని ఇంజనీరింగ్​ కాలేజీలకే అనుమతించిన ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్(ఏఐ) కోర్సు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని కాలేజీలకూ అనుమతివ్వనున్నట్లు వర్సిటీ తెలిపింది.  వచ్చే ఏడాది ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్​అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్​ అండ్​ బిజినెస్​ సిస్టమ్స్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ అండ్​ఇంజనీరింగ్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో యూజీ కోర్సుల సంఖ్య 22 నుంచి 26కు పెరిగింది. ఎంఫార్మసీలోనూ ఫార్మసీ ప్రాక్టిస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు.

మరిన్ని వార్తల కోసం..