
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో కేసులను చాలా వరకు కట్టడి చేయగలిగామని ఓ సంస్థ వెల్లడించింది. లాక్డౌన్ పెట్టకపోయుంటే ఇప్పుడున్న కేసులకు 9 రెట్లుండేవని, 2 లక్షలు దాటిపోయేవని తెలిపింది. దేశమంతా లాక్డౌన్ పెట్టడం ఎంతో మేలు చేసిందని వివరించింది.
లాక్డౌన్ నాటికి 571 కేసులు
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన మార్చి 24న దేశంలో 571 కేసులున్నాయని, అప్పటికి కేసులు నమోదవుతున్న రేటు 21.6 శాతంగా ఉందని సంస్థ చెప్పింది. మూడ్రోజులుగా ఇది 8 శాతం దగ్గర ఉందంది. అప్పటిలా 21 శాతం కేసులు నమోదవుతూ ఉంటే ఇప్పడు మనదగ్గర 2 లక్షల కేసులయ్యేవని వివరించింది. మరోవైపు లాక్డౌన్ ప్రకటించిన చాలా దేశాల్లో మనకన్నా కేసులు తక్కువ నమోదవుతున్నాయని చెప్పింది. ఇండియాలో 8 శాతం కేసులు నమోదవుతుంటే జర్మనీలో 2 శాతం, అమెరికాలో 4.8 శాతం రికార్డవుతున్నాయంది.
15 రోజుల్లో 70 వేలకు..
దేశంలో ఇప్పుడున్న స్పీడ్లోనే కేసులు నమోదవుతూ పోతే వచ్చే మరో 15 రోజులకు 70 వేలు, మే చివరి నాటికి రెండున్నర లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది. కేసుల రేటును 6 శాతానికి తగ్గిస్తే లక్షా ముప్పై వేలయ్యే చాన్స్ ఉందంది. 5 శాతానికి తగ్గితే లక్ష కేసులవ్వొచ్చని వివరించింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు చాలా వరకు తగ్గాయని, కేరళలో 1.8 శాతం రికార్డవుతున్నాయని పేర్కొంది.
కేసులు తగ్గుతున్నయ్: కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం=శనివారం మధ్య కేసులు నమోదైన రేటు 6 శాతంగా ఉందని, దేశంలో 100 కేసులు దాటిన తర్వాత కేసుల వ్యాప్తి ఇంతలా తగ్గడం ఇదే తొలిసారని చెప్పింది. డబ్లింగ్ రేటు కూడా తగ్గుతోందని, ప్రస్తుతం 9.1 రోజులకోసారి కేసులు రెండింతలవుతున్నాయని వివరించింది. దేశంలో మరణాల రేటు 3.1 శాతంగా ఉందని, రికవరీ రేటు కూడా 20 శాతానికి మించి ఉందని, మిగతా దేశాలతో పోలిస్తే ఇది చాలా వరకు బెటరని కేంద్రం వివరించింది. ఇప్పటివరకు 5,062 మంది కోలుకున్నారని చెప్పింది. కొవిడ్ 19పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 13వ మీటింగ్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఐసోలేషన్ బెడ్లు, కొవిడ్ హాస్పిటళ్లు, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, డ్రగ్స్పై చర్చ జరిగింది. ‘దేశంలో రోజూ లక్ష ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు రెడీ అవుతున్నాయి. పీపీఈ కిట్లను 104 కంపెనీలు, ఎన్95 మాస్కులను మూడు కంపెనీలు రెడీ చేస్తున్నాయి’ అని మంత్రులు చెప్పారు. దేశీయంగా 9 కంపెనీలు వెంటిలేటర్ల తయారీనీ స్టార్ట్ చేశాయన్నారు. వలస కూలీలకు ఆహారం అందించడానికి దేశవ్యాప్తంగా 92
వేల ఎన్జీవోలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు పని చేస్తున్నాయని చెప్పారు. అవసరమైనప్పుడు వాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న హెల్త్ వర్కర్లు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఎన్వైకే, డాక్టర్లు లిస్టును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాన్నారు.