మీరు సమోసా ప్రియులా...మీకు సమోసా అంటే బాగా ఇష్టమా..అయితే ఓ అద్భుతమైన ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. సమోసా తింటే 51వేల ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం. ఎంటీ సమోసా తింటే 51వేల ప్రైజ్ మనా అనుకుంటున్నారా..అవును ఈ ఆఫర్ నిజమే.
బాహుబలి సమోసా..
కరోనా తర్వాత రెస్టారెంట్లకు కస్టమర్లు రాక వెలవెలబోతున్నాయి. దీంతో అనేక రెస్టారెంట్లు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక ఐటెమ్ తింటే మరోటి ఫ్రీ అన్నట్లు ఆఫర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా భారీ ప్రైజ్ మనీలతో భోజన ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని మీరట్కు చెందిన శుభమ్ కౌశల్ కు లాల్కుర్తి బజార్లో కౌశల్ స్వీట్ షాపు ఉంది. ఈ మిఠాయి దుకాణంలో అనేక రకాల స్వీట్లు, ఇతర తినుబండారాలున్నా..ఇక్కడ మాత్రం సమోసాలు ఫేమస్. అయితే తాను తయారు చేసే సమోసాలకు పబ్లిసిటీ కల్పించుకునేందుకు ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఏకంగా 4 కిలోల సమోసా తయారు చేసి..అది తింటే రూ. 11 వేలు ఇస్తానని ప్రకటించాడు. ఈ ఆఫర్ తో కౌశల్ స్వీట్ షాపు పేరు మారుమోగిపోయింది. కస్టమర్లను మరింతగా ఆకర్షించాలని ఈ సారి ఏకంగా 8 కేజీల సమోసా చేశాడు. అంతేకాదు ఆ సమోసాకు బాహుబలి సమోసాగా నామకరణం చేశాడు. ఈ బాహుబలి సమోసాను అర గంటలో తింటే.. రూ. 51 వేల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. మరోసారి కౌశల్ స్వీట్ షాపు పేరు మీరటే కాకుండా దేశం మొత్తం తెలిసిపోయింది. ఎంతో మంది ఈ ఛాలెంజ్ ను స్వీకరించి 51 వేలు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. కానీ 8 కేజీల సమోసా తినలేక..దాని ధర చెల్లించి వెనుదిరుగుతున్నారు.
ప్రస్తుతం ఈ బాహుబలి సమోసా ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరైతే తినడం కష్టమని కామెంట్లు చేస్తుంటే..మరికొందరు సమోసా ప్రియులు మాత్రం ఏ ఈజీగా తినొచ్చని చెబుతున్నారు. మరి మీరు కూడా ఈ బాహుబలి సమోసాను తినగలరు అనుకుంటే..మీరట్ కు వెళ్లాల్సిందే.