సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్లో కృత్రిమ ఊపిరితిత్తులపై రీసెర్చ్

సంగారెడ్డి జిల్లా కందిలోని  ఐఐటీహెచ్లో కృత్రిమ ఊపిరితిత్తులపై రీసెర్చ్
  •     జర్మనీకి చెందిన ఇన్​స్టిట్యూట్ ఫర్​లంగ్ హెల్త్​ సంస్థతో కలిసి పరిశోధనలు 
  •     బయో ఇంజినీరింగ్​ సెంటర్​ ఆఫ్​  ఎక్సలెన్స్​ ప్రారంభించిన డాక్టర్​ నాగేశ్వర్​ రెడ్డి 

సంగారెడ్డి, వెలుగు: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఐఐటీ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్ వేదికగా జర్మనీకి చెందిన ప్రముఖ ఇన్‌‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ (ఐఎల్​హెచ్)తో కలిసి కృత్రిమ ఊపిరితిత్తుల తయారీపై రీసెర్చ్ చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఐఐటీహెచ్ క్యాంపస్​లో “బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” పేరుతో టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ను ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ ఊపిరితిత్తులకు పరిశోధనలు సక్సెస్ చేయడానికి, లంగ్స్​కు వచ్చే వ్యాధుల నివారణ, చికిత్సలో మెరుగైన విధానాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయనున్నట్టు తెలిపారు. 

దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రపంచ స్థాయిలోనూ పరిష్కారాలు చూడడమే ఈ పరిశోధనల లక్ష్యమన్నారు. ఇంజనీరింగ్, క్లినికల్ సైన్స్ సమ్మేళనంతో నాన్ ఇన్వెసివ్ డయాగ్రోస్టిక్, ఆధునిక చికిత్స విధానాల అభివృద్ధి, భవిష్యత్తు లంగ్ హెల్త్ పరిశోధక నాయకుల శిక్షణకు ఇండో- జర్మన్ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందన్నారు. 

కృత్రిమ ఊపిరితిత్తులతో ఫలితాలు..  

  •     లంగ్స్ పూర్తిగా పాడైపోతే ప్రస్తుతం ‘ట్రాన్స్‌‌ప్లాంటేషన్’ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. దీనికి పరిష్కారం      అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసే కృత్రిమ ఊపిరితిత్తులే. వీటితో తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించాలని శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.  
  •     ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న శ్వాసకోశ సమస్యలకు మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ పరిశోధన సక్సెస్ అయితే భవిష్యత్తులో అవయవ దాతల కోసం ఎదురు చూడకుండా కృత్రిమ అవయవాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. -------