
నిర్మల్, వెలుగు: ఆరేండ్ల కన్న కూతురిని అత్యాచారం చేసిన తండ్రికి నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు జడ్జి శ్రీవాణి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. తీర్పు వివరాలను నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల వెల్లడించారు. 2021 ఏప్రిల్ 16న సోన్ మండలంలోని గాంధీనగర్ కి చెందిన అగ్నప్ప (35) తన భార్య ఇంట్లో లేని సమయంలో సొంత కూతురిపైనే అత్యాచారం చేశాడు.
భార్య ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ, ప్రస్తుత నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడడంలో కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వాస్ రెడ్డి, విచారణ అధికారి ఎస్పీ ఉపేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, ఏఎస్సైలు డల్లు సింగ్, భాస్కర్ తదితరులను ఎస్పీ అభినందించారు.