
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని శేషగిరినగర్ నంబర్ 2 ఇన్క్లైన్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనున్న సింగరేణి సంస్థకు చెందిన స్థలాన్ని ఓ వ్యక్తి దర్జాగా ఆక్రమించి, షెడ్డు నిర్మించేందుకు సిమెంట్ కాంక్రీట్తో పునాది కూడా కట్టేశాడు. శాంతిఖని బొగ్గుగనిలో బొగ్గు తవ్వకాల కోసం నిత్యం వందలాది మంది కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. భారీ వాహనాలు, లారీలు కూడా ఈ మార్గం గుండా వెళ్తుంటాయి. అలాంటి రద్దీ రహదారి పక్కనే జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత సింగరేణి అధికారులైనా, మున్సిపల్ అధికారులు స్పందించడంలేదు. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించే మున్సిపల్ అధికారులు.. భారీ ఆక్రమణలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏరియా జీఎం, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తక్షణం స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని ప్రజలు, సింగరేణి కార్మికులు కోరుతున్నారు.