![ఫార్మా కంపెనీలో బ్యాన్ చేసిన డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న అధికారులు..](https://static.v6velugu.com/uploads/2024/02/illegal-drugs-seized-in-hyderabad-pharma-company_cxw6WuQIPm.jpg)
ఫార్మా కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో డీసీఏ అధికారులు పెద్దమొత్తంలో రెండు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 'సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్' 110 కిలోలు, 'గాటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్' 8.4 కిలోలుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం లాల్గాడిమలక్పేట్ గ్రామంలోని బయోటెక్ పార్క్ ఫేజ్-2లోని ఆస్పెన్ బయోఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో శామీర్పేట్ జోన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు.
మచ్చబొల్లారంలో గుర్తించిన నకిలీ క్యాన్సర్ నిరోధక మందుల కేసులో ప్రధాన నిందితుడు కడారి సతీష్ రెడ్డికి చెందినదిగా అధికారులు గుర్తించి ఈ దాడులు చేశారు. ఆస్పెన్ బయోఫార్మా ల్యాబ్స్ తనిఖీ సమయంలో మంచి పద్ధతులు డ్రగ్స్ తయారు చేయట్లేదని గుర్తించారు. వివిధ నిబంధనల కారణంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, మార్చి 2023లో ఈ కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసే ఉత్తర్వును జారీ చేసిందని తెలిపారు. ఆ తర్వాత డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి తయారీ కార్యకలాపాలు చేపట్టేందుకు కంపెనీకి అనుమతి లేదు.
అయితే స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ సమయంలో ఆస్పెన్ బయోఫార్మా అక్రమంగా 'సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్', 'గటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్' మందులను తయారు చేసిందని డీజీ డీసీఏ, వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ సోదాల్లో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.5.50 లక్షలు.తదుపరి విచారణ నిర్వహించి, నేరస్తులందరిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీసీఏ తెలిపింది.