కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తాడు. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తున్నది. అయితే ఆచరణలో గవర్నర్ నియామకంలో కేంద్రం పూర్తిగా రాజకీయ ధోరణితో వ్యవహరిస్తున్నది. దీనిని నివారించడానికి సర్కారియా కమిషన్ కింది సూచనలు చేసింది. నానాటికీ వివాదస్పదమవుతున్న గవర్నర్వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సర్కారియా కమిషన్ కీలక సిఫారసులు చేసింది. ఎ. గవర్నర్ గా నియామకమయ్యే వ్యక్తి బయటి రాష్ట్రంవాడై ఉండాలి. ఈ అంశం ఒక సాంప్రదాయకంగా అమలు జరుగుతోంది.
అయితే, గతంలో హరేంద్ర కుమార్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి అయినా అదే రాష్ట్రానికి గవర్నర్గా నియామకమయ్యారు. బి. నియామకానికి రెండేండ్ల ముందు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించకూడదు. ఈ నియమం పూర్తిగా ఉల్లంఘనకు గురవుతోంది. ఉదా: యూపీఏ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించిన సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర గవర్నర్గా నియమించిన ఎస్.ఎం.కృష్ణలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.సి. గవర్నర్ నియామకంలో సదరు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఈ నియమం కూడా ఉల్లంఘించబడుతోంది. ఉదా: 2004లో సూర్జీత్సింగ్ బర్నాలాను తమిళనాడు గవర్నర్ గా నియమించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను సంప్రదించకుండా నియమించడం వివాదాస్పదమైంది.