ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్లకు తెరపడింది. జైల్లో ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదని.. ప్రాణాలతో ఉన్నాడని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ క్లారిటీ ఇచ్చారు. కాకపోతే తన సోదరుడిని జైల్లో మానసిక హింసకు గురి చేస్తున్నారని.. ఎవరితోనూ సంభాషించడానికి అనుమతించడం లేదని తెలిపారు. జైలు అధికారుల తీరుపై ఇమ్రాన్ చాలా కోసం ఉన్నాడని చెప్పారు. ఉజ్మా ఖాన్ ప్రకటనతో ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్న ఊహాగానాలు తొలిగిపోయాయి.
అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుంచి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబీకులను కూడా కలవనివ్వడం లేదు. ఇదే సమయంలో.. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ సహా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ హత్యకు గురయ్యారని పేర్కొన్నాయి.
►ALSO READ | త్వరలో ప్రపంచ యుద్దం వస్తుంది..! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఒక ఫొటోను కూడా విడుదల చేశారు. దీంతో ఇమ్రాన్ మరణ పుకార్లు పాకిస్తాన్లో వేగంగా వ్యాపించాయి. ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఇమ్రాన్ను చూపించాలని అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 2) జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అడియాలా జైల్లో సోదరుడిని కలిశారు.
అనంతరం ఉజ్మా మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని.. ఫిట్గా ఉన్నాడని చెప్పారు. కాకపోతే అతన్ని మానసిక హింసకు గురి చేస్తున్నారని.. ఎవరితోనూ మాట్లాడేందుకు అనుమతించడం లేదన్నారు. అధికారుల తీరుపై ఇమ్రాన్ కోపంగా ఉన్నాడని చెప్పారు. దీంతో జైల్లో ఆయన హత్యకు గురయ్యాడన్న ప్రచారం అంతా వట్టిదే అని తేలిపోయింది.
