హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇబ్బందులు ఉండకూదనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టుకున్నామని రాష్ట్ర సర్కార్ గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం గా ఉంది. చాలా జిల్లాల్లో ఇన్చార్జ్ కలెక్టర్ల పాలనే నడుస్తోంది. ఐదు జిల్లాలకు రెగ్యులర్ కలెక్టర్లు లేరు. హైదరాబాద్తోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాల్లో ఇన్చార్జ్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ధరణితోపాటు చాలా సమస్యలు పెండింగ్లో పడుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని కీలక శాఖలు సీఎస్ దగ్గరే ఉండిపోయాయి. నలుగురు ఐఏఎస్ల దగ్గరే రెండు, మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరోవైపు కొంత మంది ఐఏఎస్లు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు.
కొన్ని నెలలుగా అంతే
హైదరాబాద్ కలెక్టర్గా పనిచేసిన శర్మన్ రిటైర్ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ పక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరిలో వెంకటేశ్వర్లును బదిలీ చేసినప్పటి నుంచి పూర్తిస్థాయి కలెక్టర్ నియమించలేదు. మెదక్ కలెక్టర్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. 4రోజులు మెదక్లో.. 2రోజులు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉండాల్సిన పరిస్థితి. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇటీవల సిద్దిపేటకు బదిలీ అయ్యారు. ఆ జిల్లాకూ రెగ్యులర్ కలెక్టర్ను నియమించలేదు. ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకే అదనపు బాధ్యతలు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఎంవీ రెడ్డి రిటైర్ తరువాత ఎవరిని నియమించలేదు. ఆ జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అనుదీప్కే అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల కలెక్టర్గా పనిచేసిన క్రాంతి సెలవుపై వెళ్లగా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్షకు పూర్తిస్థాయి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు.
డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలదీ అదే పరిస్థితి
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు సెక్రటరీలు కరువయ్యారు. కీలక శాఖలన్నీ కొందరు ఐఏఎస్ ల ఇన్చార్జ్ పాలనలోనే నడుస్తున్నాయి. కొందరి దగ్గర రెండు నుంచి నాలుగు శాఖలు ఉండడంతో వారు ఏ ఒక్క శాఖపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగానే సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఇప్పటికీ ఆ శాఖలు ఆయన వద్దే ఉన్నాయి. రెవెన్యూ శాఖలో కీలకమైన సీసీఎల్ఏ పోస్టులో ఐదేండ్లుగా ఆయనే కొనసాగుతున్నారు. మరో సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్, గ్రామీణాభివృవృద్ధి శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ.. యూత్సర్వీసెస్, స్పోర్ట్స్ కూడా ఆయనే చూస్తున్నారు. సెర్ప్ ఇన్చార్జ్ సీఈవోగా రెండేండ్లుగా సుల్తానియానే కొనసాగుతున్నారు. సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జా సీఎంవో సెక్రటరీగా పని చేస్తూనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీగా కొనసాగుతున్నారు. ఎస్సీ డెవలప్మెంట్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా ఉన్నారు. రఘునందన్ రావు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కమిషనర్గా ఉన్నారు. జయశంకర్ విశ్వవిద్యాలయానికి వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఅండ్ పీఆర్, హెచ్ఎండీఏ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోనాల్డ్ రాస్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీతోపాటు గురుకులాల కార్యదర్శిగా, మైనింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ కుమార్కు సివిల్ సప్లయ్స్, ఎండోమెంట్స్ను ప్రభుత్వం అప్పగించింది.