
- డాక్టర్ల పీఆర్సీ ఎరియర్స్ జీవోతో కులాల పంచాయితీ
- ఎరియర్స్ కోసం టీజీడీఏ, టీటీజీడీఏ నిరసనలు
- టీటీజీడీఏ నేతలనే మంత్రి పిలవడంతో విమర్శలు
- వెలమ, కమ్మవాళ్లున్నందుకే వాళ్లను పిలిచారు..
- దళితులైనందుకే తమపై వివక్ష చూపారని టీజీడీఏ లీడర్ల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి పీఆర్సీ ఎరియర్స్ జీవో కులాల పంచాయితీగా మారింది. 2016 నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్ కోసం కొన్ని రోజులుగా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీడీఏ), తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ) వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
టీజీడీఏ ఇప్పటికే గాంధీ, ఉస్మానియాలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. డీఎంఈ ఆఫీసు ఎదుట నిరసన తెలిపింది. ఈ నెల 27న నిలోఫర్లో ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 20న టీటీజీడీఏ చలో హైదరాబాట్ పేరిట డీఎంఈ ఆఫీసు ఎదుట నిరసన తెలిపింది. ఈ నెల 22న మంత్రి హరీశ్రావు టీటీజీడీఏ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని మాట్లాడారు. పీఆర్సీ ఎరియర్స్ రిలీజ్ చేయిస్తానని మాటిచ్చారు. ఈ మేరకు శనివారం జీవో కూడా విడుదల అయింది. టీటీజీడీఏ నాయకులకు జీవో వెలువడుతున్నట్టు మంత్రి ఆఫీసు నుంచి ముందే సమాచారం ఇచ్చారు.
అసోసియేషన్ నాయకులను ప్రగతి భవన్కు పిలిపించుకున్న మంత్రి, వారికి జీవో కాపీని అందజేశారు. ప్రొఫెసర్ల ట్రాన్స్ఫర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో జీవో సైతం విడుదల చేసిన మంత్రి, ఆ జీవో కాపీని కూడా టీటీజీడీఏ నాయకులకు అందజేశారు. అప్పటికే డీఎంఈ ఆఫీసు వద్దకు వచ్చి ఉన్న టీటీజీడీఏ ప్రతినిధులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ సంబురాలు జరిపారు. దీంతో ఇవే డిమాండ్లతో నిరసనలు తెలుపుతున్న తమ అసోసియేషన్ను పిలవకపోవడంపై టీజీడీఏ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘టీటీజీడీఏ ప్రెసిడెంట్ ముస్లిం, సెక్రటరీ వెలమ, వైస్ ప్రెసిడెంట్ కమ్మ వ్యక్తి. అందుకే మంత్రి వారిని పిలిపించుకున్నారు. టీజీడీఏకు నాయకత్వం వహిస్తున్న వాళ్లంతా దళితులు, ఎస్టీలు, బీసీలు అందుకే మాపై వివక్ష చూపిస్తున్నారు’’ అని టీజీడీఏ లీడర్ బొంగు రమేశ్ ఆరోపించారు. ప్రగతిభవన్లో ఎంట్రీ వాళ్లకేనా, మాకు(దళితులకు) లేదా అని పల్లం ప్రవీణ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలపై అనాదిగా ఉన్న అణచివేత, తెలంగాణలో ఇప్పటికీ కొనసాగుతోందని డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల్లో ట్రాన్స్ఫర్లు
ప్రొఫెసర్ల ట్రాన్స్ఫర్లకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్, నెల రోజుల్లోగా ట్రాన్స్ఫర్లు కంప్లీట్ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డిని ఆదేశించింది. 2016 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఒకేసారి కాకుండా దశలవారీగా చెల్లిస్తామని జీవోలో సర్కార్ పేర్కొంది. కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఉన్నవాళ్లకు 36 ఇన్స్టాల్మెంట్లలో ఎరియర్స్ను చెల్లిస్తామని తెలిపింది. పాత పెన్షన్ స్కీమ్లో ఉన్నవారికి మొత్తం బకాయిలను పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది.
టీవీవీపీ అధ్యయనానికి కమిటీ
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్పై అధ్యయనం చేసేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు ఈ కమిటీలో మెంబర్లుగా, వైద్య విధాన పరిషత్ కమిషనర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారని పేర్కొంది. ఏపీలో వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్గా సీఎం జగన్ ప్రభుత్వం మార్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ట్రెజరీ నుంచి శాలరీలు ఇస్తోంది. తెలంగాణలో కూడా ఇదే విధంగా చేయాలని టీవీవీపీ డాక్టర్లు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిటీని వేసింది.