వివిధ పనుల మీద వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. త్వరగా వెళ్లాలన్న ఆతృతతో అతివేగం, అజాగ్రత్తతో కొందరు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో మరికొందరు.. మద్యం తాగి..ఇంకొందరు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. బైక్దారులు హెల్మెట్లేకుండా, రాంగ్రూట్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొని వారి జీవితాలను కోల్పోతున్నారు. దీంతో తమిళనాడు తిరువారూర్ లో పదో తరగతి చదువుతున్న ఓ బాలిన హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే జరిగే ప్రమాదాలను వివరిస్తూ.... హెల్మెట్ ధరించిన వారికి పెట్రోల్ ఉచితంగా ఇస్తూ అవగాహన కల్పిస్తుంది.
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నియమం ఉంది. ఆర్ టీఐ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉన్నా.. తిరువారూర్ లో చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించరు. దీంతో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల భారతదేశంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒక అధికారిక నివేదిక ప్రకారం .. 2020లో ఇండియాలో 39 వేల 500 మంది శిరస్త్రాణం ( హెల్మెట్) లేకుండా బైక్ డ్రైవ్ చేసినందుకు మరణించారని పేర్కొంది. అయితే ఈ మరణాలలో 12 శాతం మహారాష్ట్రలోనే జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాలు భయంకరంగా మారుతున్నాయి. కొంతమంది నెటిజన్లు హెల్మెట్ ధరించే ద్విచక్రవాహనాన్ని నడపాలని అవగాహన కల్పించే బాధ్యతను తీసుకున్నారు. అలాంటి వారిలో తమిళనాడులోని తిరువారూరు జిల్లాకు చెందిన రాఘవి ఒకరు. పదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి హెల్మెట్ ధరించిన వారికి ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తోంది.
తిరువారూరు జిల్లా కోటూరు యూనియన్ పరిధిలోని ఆదిచాపురం ప్రాంతానికి చెందిన చక్రపాణి, పుష్ప దంపతులకు విజయ్, రాఘవి అనే ఇద్దరు పిల్లలు. సెయింట్ ఆంథోనీస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన రాఘవి అనే విద్యార్థిని పాఠశాలలో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకొని... ప్రజలు నిబంధనలు పాటించడం లేదని గమనించింది. దీంతో రాఘవి తన పాకెట్ మనీతో పెట్రోల్ బాటిల్ కొని, మన్నార్గుడి నుంచి ఆదిచ్ఛాపురం ప్రాంతం మీదుగా తిరుతురాపూండి వెళ్లే రోడ్డుపై హెల్మెట్ ధరించి వెళ్తున్న 20 మంది వాహనదారులకు అరలీటర్ పెట్రోల్ అందించింది. బాటసారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను ఆ చిన్నారి వివరిస్తుంది. గతంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు సేకరించిన కొద్ది మొత్తంలో విజయ్, రాఘవి పిల్లలు 100 పసుపు బస్తాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. కనీసం ఇప్పటికైనా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.