ఓల్డ్ ఏజ్ హోం పేరుతో అక్రమంగా సైకియాట్రిక్ సెంటర్ నడుపుతూ అందులోని వారిని నానా చిత్రహింసలు గురి చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు. కీసర మండల పరిధిలోని నాగారం శిల్పా నగర్ కాలనీలో ఉన్న మమత ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఆశ్రమంలో.. తాము ఇబ్బందులు పడుతున్నామంటూ 100 కి కాల్ చేశారు అక్కడి బాధితులు. వారు చెప్పిన వివరాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఆశ్రమానికి చేరుకొని వారు పడుతున్న కష్టాలను నేరుగా చూశారు.
కీసర సి నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రాత్రి తమకు బాధితులు ఫోన్ చేశారని, అక్కడికి వెళ్లి విచారించగా.. ఓల్డ్ఏజ్ హోం లో వృద్ధులను కాకుండా.. మానసిక రోగులని, మద్యానికి,గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులని వృద్ధులతో పాటు ఉంచారని ఉన్నారు. అక్కడున్న కొందరి యువకుల తల్లిదండ్రులే ఆ ఓల్డ్ఏజ్ హోంకు డబ్బులు చెల్లించి మరి ఆ ఆశ్రమంలో ఉంచారని తెలిపారు.
గురువారం ఈ ఓల్డ్ ఏజ్ హోం కి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ పై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి.. అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తాసిల్దార్ నాగరాజు మమత ఓల్డ్ఏజ్ హోంను పరిశీలించగా… ఇరుకైన రెండు ఇండిపెండెంట్ బిల్డింగ్లలో 63 మంది పురుషులను,22 మంది మహిళలను మొత్తం 85 మందిని ఉంచారని తెలిపారు.మానసికంగా,చెడు అలవటులకు బానిసైన వారిని ఆసుపత్రిలో చూపించిన అనంతరం వారి తల్లిదండ్రులే ఈ ఓల్డ్ఏజ్ హోంలో పెట్టడం జరిగిందని అన్నారు.
గురువారం రాత్రి ఓల్డ్ఏజ్ హోంను సందర్శించిన మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి.. అక్కడ ఉన్న మానసిక రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఓల్డ్ఏజ్ హోం పేరుతో వృద్దులను కాకుండా ఇలా మద్యానికి,గంజాయి అలవాటు పడ్డ అందరిని ఒకే దగ్గర ఉంచడం సరికాదని ఆయన అన్నారు. మమత ఓల్డ్ఏజ్ హోం నిర్వాహకులు షేక్ జాన్ పాల్, భారతి మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఓల్డ్ఏజ్ హోంలో ఉన్న వారిని శుక్రవారం వేరే ఓల్డ్ఏజ్ హోంలకు తరలిస్తామని తెలిపారు.