
- వెన్ను నొప్పితో మ్యాచ్ కు దూరమైన కోహ్లీ
- ఆల్ ఈజ్ నాట్ వెల్?
జొహన్నెస్బర్గ్: ఫామ్లో లేక గ్రౌండ్లో, వన్డే కెప్టెన్సీ విషయంలో గొడవతో ఫీల్డ్ బయట ఇబ్బంది పడుతున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని ప్లేస్లో హనుమ విహారి టీమ్లోకి రాగా.. లోకేశ్ రాహుల్ కెప్టెన్సీ చేపట్టాడు. బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే, కోహ్లీ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న విషయం చివరి నిమిషం వరకూ తెలియకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టాస్కు వచ్చిన రాహుల్ ‘దురదృష్టవశాత్తూ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. ఫిజియోలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మూడో టెస్టుకల్లా తను రికవర్ అవుతాడని భావిస్తున్నాం’ అని చెప్పాడు. కానీ, ఆదివారం మధ్యాహ్నం జరిగిన నెట్ సెషన్లో కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేశాడు.
కొన్ని షాట్స్ ఆడుతున్న ఫొటోలను సైతం కోహ్లీ ట్వీట్ చేశాడు. అదే రోజు మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ ద్రవిడ్.. కోహ్లీ బ్యాక్ పెయిన్ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. పైగా, తను తొందర్లోనే పెద్ద స్కోర్లు చేస్తాడని, అది ఈ మ్యాచ్ నుంచే స్టార్ట్ అవ్వొచ్చని చెప్పాడు. ఈ లెక్కన సోమవారం ఉదయమే విరాట్కు బ్యాక్ పెయిన్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. దాంతో, తన 99వ టెస్టు మ్యాచ్కు దూరం అయ్యాడు. కోహ్లీ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడటం కొత్తేం కాదు. 2018లో ‘హెర్నియేటెడ్ డిస్క్’ (డిస్క్ జారడం) అనే కండిషన్తో ఇబ్బంది పడ్డాడు. దాంతో, ఆ టైమ్లో ఇంగ్లిష్ కౌంటీలు ఆడొద్దని డాక్టర్లు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ సమస్య ఎదురైంది. కోహ్లీ వారం లోపు కోలుకుంటే థర్డ్ టెస్టు ఆడతాడు. అప్పుడు తన కెరీర్లో వందో టెస్టును బెంగళూరులో (మార్చిలో శ్రీలంకతో) ఆడొచ్చు. ఇది ఐపీఎల్ ఆర్సీబీ టీమ్ ఫ్యాన్స్కు, బ్రాడ్కాస్టర్స్కు గుడ్న్యూసే. కానీ సౌతాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసే అద్భుత అవకాశం ముందున్న టైమ్లో కోహ్లీ దూరం అవడం ఇండియాకు కచ్చితంగా ఎదురుదెబ్బే.
ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమ్ తక్కువ స్కోరుకే ఆలౌటవడం చూస్తే విరాట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదే టైమ్లో వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో మొదలైన హైడ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. బీసీసీఐ బాస్ గంగూలీ వ్యాఖ్యలతో విభేదించిన తర్వాత కోహ్లీ మళ్లీ మీడియా ముందుకు రాకపోవడం, ఇప్పుడు సడన్గా మ్యాచ్కు దూరం కావడంతో టీమ్లో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనిపిస్తోంది. కోహ్లీ నిజంగానే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడా? లేక వన్డే టీమ్ ఎంపిక టైమ్లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన కామెంట్స్తో హర్ట్ అయ్యాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.