
- వివాహేతర సంబంధం అంటగట్టిన భర్త
- భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటూ వేధింపులు
జీడిమెట్ల, వెలుగు: పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో పెండ్లయిన 15 రోజులకే భర్త వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. సీఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ బాపునగర్కు చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)కు మేడ్చల్ మండలం డబిల్పురాకు చెందిన శ్రీరామ్రెడ్డి కొడుకు సంతోష్రెడ్డితో ఈనెల 5న పెండ్లి జరిగింది. వధువు తరఫు వారు పెండ్లి సమయంలో 60 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఇతర సామాన్లు ఇచ్చారు. గుమ్మడిదలలో ఉన్న 550 గజాల ప్లాట్ను నిషిత పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు.
పెండ్లయినప్పటి నుంచి ప్లాట్ను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ నిషితను ..సంతోష్రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. నిషిత ఫోన్ తీసుకుని పెండ్లికి ముందు జాబ్ చేసిన ఆఫీసులోని తోటి ఉద్యోగుల ఫోన్ నంబర్ల డీపీలను స్ర్కీన్షాట్ తీసి వారితో వివాహేతర సంబంధం అంటగట్టేవాడు. ఈనెల 17న సాయంత్రం నిషితను ఆమె పుట్టింటికి తీసుకెళ్లి ‘నీ కూతురుకు చాలా మందితో సంబంధం పెట్టుకుంది’ అని చెప్తూ చేయిచేసుకున్నాడు. ప్లాట్ రిజిస్ట్రేషన్ త్వరగా చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. 18న మళ్లీ ఇంటికి వచ్చి ఆమె ఫోన్లో ఉన్న నంబర్లు ఎవరివో చెప్పాలని అడిగి ఫోన్ తీసుకుపోయాడు.
రాత్రి 10 గంటలకు నిషిత సోదరుడు సంతోష్రెడ్డితో మాట్లాడుతుండగా నిషిత గ్రౌండ్ఫ్లోర్లోకి వెళ్లి హుక్కి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి వెళ్లి చూసే సరికి ఆమె చనిపోయింది. సంతోష్రెడ్డి వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.