నార్నేలో సీలింగ్ ల్యాండ్స్‌‌!..సర్కారు సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

నార్నేలో సీలింగ్ ల్యాండ్స్‌‌!..సర్కారు సర్వేలో బయటపడుతున్న అక్రమాలు
  • 4.10 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు
  • 312 ఎకరాల్లో అనుమతి లేకుండా ప్లాట్లు చేసిన సంస్థ
  • 700 ఎకరాల భూదాన్ ​ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కోర్టులో కేసు

యాదాద్రి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన భూసర్వేలో అక్రమాలు బయటపడుతున్నాయి.  రియల్​ఎస్టేట్​వ్యాపారులు సీలింగ్​ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కబ్జా చేసి వెంచర్లు వేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యాదాద్రి జిల్లా కేంద్రంగా రియల్​ఎస్టేట్​వ్యాపారం చేసిన ‘నార్నే’ సంస్థ  వెంచర్లలో సీలింగ్​ల్యాండ్స్​ఉన్నట్లు  రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం 4.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.

1985 నుంచి ‘నార్నే’ వ్యాపారం

నార్నే రియల్​ ఎస్టేట్​ సంస్థ 1985 నుంచి యాదాద్రి జిల్లా కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తోంది. జిల్లాలోని బీబీనగర్​ నుంచి మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని అవుశాపూర్​ (ఘట్​కేసర్​) వరకు ‘ఈస్ట్ సిటీ’ పేరుతో   వేలాది ఎకరాల్లో రియల్​ వ్యాపారం చేసింది. అయితే ఈ సంస్థ పలు భూముల్లో అక్రమాలకు పాల్పడ్డట్లు గతం నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థపై పలువురు బాధితులు కోర్టుల్లో కేసులు కూడా వేశారు.  

 సీలింగ్ ​ల్యాండ్​ గుర్తింపు

అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, భువనగిరి ఆర్డీవో అమరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర రెవెన్యూ అధికారులు గురువారం బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని నార్నే రియల్​ ఎస్టేట్​సంస్థ భూముల్లో సర్వే చేశారు.   254,  256  సర్వే నెంబర్లలోని భూమిని కొలతలు వేసి..  4.10 ఎకరాల సీలింగ్​భూమి ఉన్నట్టు గుర్తించారు.  అనంతరం దాన్ని స్వాధీనం చేసుకొని హద్దురాళ్లు పాతారు. అలాగే ఈ భూమిని అప్పట్లో ఇద్దరు వ్యక్తులకు అసైన్ట్​ చేసినట్టు గుర్తించిన ఆఫీసర్లు.. వారికి నోటీసులు ఇచ్చారు. కాగా, ఈ  భూమిని అమ్మినట్టు తమకు తెలియదని వారసులు చెప్పడం గమనార్హం. 

145 ఎకరాల సొమ్ము కోర్డులో డిపాజిట్​ 

బీబీనగర్​లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్​ కోసం నార్నే రియల్​ఎస్టేట్​ నుంచి ప్రభుత్వం 145 ఎకరాలను కొనుగోలు చేసింది. అయితే ఈ భూములు వివాదంలో ఉండడంతో ప్రభుత్వం రూ. 1.21 కోట్లను కోర్టులో డిపాజిట్​ చేసింది. 

అనుమతి లేకుండా 312  ఎకరాల్లో వెంచర్​

బీబీనగర్​ మండలం పడమటి సోమారంలో ఎలాంటి అనుమతులు లేకుండా నార్నే ఎస్టేట్​ ప్లాట్లు చేసి విక్రయించింది. ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1991–-92 వరకు సర్వే నెంబర్లు​ 38, 39 నుంచి 270 వరకు వివిధ నెంబర్లలో రైతులు పట్టాదారులుగా ఉన్నారు. ఆ తర్వాత నార్నే ఎస్టేట్​ సంస్థ ఆధ్వర్యంలోని ‘ఈస్ట్​ సిటీ’ పేరు వచ్చింది. ఆ తర్వాత ప్లాట్లుగా మారి 1992-93 నుంచి ఇతర వ్యక్తులకు విక్రయించారు. అయితే రైతుల వద్ద కొంత భూమిని మాత్రమే కొని మిగిలిన భూమిని కలిపేసుకున్నారని, ఇలా 312 ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయించారని ఆఫీసర్ల విచారణలో తేలింది.  దీనికి సంబంధించి నార్నే ఎస్టేట్​ ప్రతినిధులతో ఆఫీసర్లు మాట్లాడినా పూర్తి వివరాలు అందించలేదని తెలిసింది. 

700 ఎకరాలకు పైగా భూదాన్​ భూములు

సీలింగ్​భూములతో పాటు ఇందులో భూదాన్​ భూములు ఉన్న విషయం మరోసారి బయటకు వచ్చింది. భూమిలేని నిరుపేదలకు 1952లో భూదాన్​ భూముల పంపిణీ జరిగింది.  అయితే ఈ భూములను లబ్ధిదారుల్లో కొందరి నుంచి నార్నే రియల్​ ఎస్టేట్​ సంస్థ తీసుకుంది. ఇలా ఇప్పటి వరకు 700 ఎకరాలకు పైగా భూదాన్​ భూములతో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లు గతంలోనే గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.