- గ్రేటర్ హైదరాబాద్లోని 9 ప్రాంతాల్లో తనిఖీలు
- ఆడిట్ రికార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన
హైదరాబాద్, వెలుగు : పలు ఫార్మా కంపెనీల్లో ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్మెంట్ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్, రాష్ట్రంలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేసినట్టు తెలిస్తున్నది. అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలోని కంపెనీల డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డాక్యుమెంట్స్ను పరిశీలించారు.
మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో గల నీం ట్రీ ఫామ్ హౌస్తోపాటు గ్లాండ్ ఫార్మా డైరెక్టర్ రాజు ఫామ్ హౌస్, స్కిల్ ప్రమోటర్స్, శ్రీహరి హోమ్స్లోని రవీంద్ర అగర్వాల్, చందర్ రాజరెడ్డి, ప్రకాష్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. కంపెనీల డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్స్, స్టేట్మెంట్స్, ఆడిట్ రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.