టీచర్లకు రూ.13,650, వర్కర్లకు 7,800 జీతం
గతంతో పోలిస్తే 30 శాతం పెంపు: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల గౌరవ వేతనం 30 శాతం పెంచుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్వాడీల జీతాల పెంపుపై శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆఫీస్లో రివ్యూ చేశారు. అంగన్వాడీ టీచర్ల జీతం రూ.10,500ల నుంచి 13,650కు, వర్కర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7,800కు పెంచుతున్నామని తెలిపారు. ఈ పెంపుతో 67,411 మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. పెంచిన వేతనాలు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి వర్తింపజేస్తామని వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల గౌరవ వేతనం కేవలం ఒకేసారి పెంచితే, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటిదాకా మూడు సార్లు పెంచిందని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం ఉంటే మోడీ సర్కారు దానిని 30 శాతం తగ్గించి 60 శాతానికి పరిమితం చేసిందన్నారు. కేవలం 10 శాతం ఉన్న రాష్ట్ర వాటా ఇప్పుడు 40 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పుడు కూడా టీచర్ల జీతాల్లో 19 శాతం, హెల్పర్ల జీతాల్లో 17 శాతం మాత్రమే కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినట్టుగానే అంగన్వాడీల గౌరవ వేతనం 30 శాతం పెంచామని తెలిపారు.