వీడియో: స్వల్ప స్కోరుకే రోహిత్ ఔట్.. పాట పాడుతూ సాగనంపిన ఇంగ్లాండ్ బర్మీ ఆర్మీ

వీడియో: స్వల్ప స్కోరుకే రోహిత్ ఔట్.. పాట పాడుతూ సాగనంపిన ఇంగ్లాండ్ బర్మీ ఆర్మీ

రాంచీ టెస్టు హోరాహోరీగా సాగుతోంది. మొదట తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల సాధారణ స్కోర్ చేసిన ఇంగ్లాండ్.. భారత్ ను 300లోపే కట్టడి చేసేలా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ భారత బ్యాట‌ర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. స్పిన్ ఆయుధంతోనే దెబ్బకొడుతున్నాడు. శుభ‌మ‌న్ గిల్‌, ప‌టిదార్, జ‌డేజా, జైస్వాల్.. వికెట్లు పడగొట్టి భారత జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 165/5 (50 ఓవర్లలో).

ఇదిలావుంటే, తొలి ఇన్నింగ్స్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(2) ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. అండ‌ర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలా హిట్‌మ్యాన్ డగౌట్ బాట పట్టిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు మద్దతుదారులైన బార్మీ ఆర్మీ, అతనికి అంకితం చేస్తూ ఒక ఉల్లాసభరితమైన ట్యూన్‌ రూపొందించారు.  "బై బై రోహిత్" అని పాట పాడుతూ భారత కెప్టెన్‌ను సాగనంపారు. అందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ బర్మీ ఆర్మీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది.

అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 ప‌రుగుల‌కు ఆలౌటైంది. జో రూట్(122*; 274 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేయగా, ఓలీ రాబిన్సన్(58) కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భార‌త స్పిన్నర్ ర‌వీంద్ర జ‌డేజా 4 వికెట్లు పడగొట్టగా, అరంగ్రేటం పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో సత్తా చాటాడు.