కసితీరా కొడుతున్న భారత ఓపెనర్లు: 17 ఏళ్ల రికార్డు బద్దలు

కసితీరా కొడుతున్న భారత ఓపెనర్లు: 17 ఏళ్ల రికార్డు బద్దలు

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(55), రోహిత్ శ‌ర్మ‌(50) జోడి వికెట్ నష్టపోకుండా.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ -  జైస్వాల్ జోడి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు.

కరేబియన్ గడ్డపై 13 టెస్ట్‌ల తర్వాత భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న య‌శ‌స్వీ జైస్వాల్ అంచ‌నాల‌ను అందుకుంటూ హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. 104 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ 106 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు.

ఈ రోజు ఇంకా 60 ఓవర్ల మిగిలివుండడంతో టీమిండియా భారీ స్కోర్ స్కోర్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగియనుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్.. 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ తీసుకున్నారు.