వీడియో: విరాట్ కోహ్లీకి అభిమాని ప్రత్యేక బహుమతి

వీడియో: విరాట్ కోహ్లీకి అభిమాని ప్రత్యేక బహుమతి

ఏ దేశంలో ఉన్నా.. ఏ ఖండంలో ఉన్నా భారతీయులకు ఎమోషన్స్‌కు ఎక్కువన్నది అందరికీ విదితమే. ఒకరిపై అభిమానం పెంచుకుంటే వారికోసం ఎంతవరకైనా వెళ్తారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుని చూసేందుకు, తమ ఫేవరెట్ క్రికెటర్లతో ఫోటోలు దిగేందుకు ఆ దేశంలో ఉన్న భారతీయులు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు.

ఇలానే ఓ చిన్నారికి తాను ఆరాధించే విరాట్ కోహ్లీని, తన ఆటను ప్రత్యక్షంగా చూడాలన్నది కల. ఆ కోరిక తీర్చుకోవడానికి ఆ చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి ఇండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేకి హాజరైంది. కానీ, ఆ చిన్నారి ఆశలు ఫలించలేదు. మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వడంతో కోహ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ ఆ చిన్నారి పదే పదే కోహ్లీ.. కోహ్లీ అంటూ అరుస్తూనే ఉంది. అందుకు కారణం.. విరాట్ కోసం తానొక బ్రేస్ లెట్ తయారుచేసింది. దానిని కోహ్లీని ఇవ్వాలనుకుంది.

ఆ అభిమాని తన పేరును పదే పదే పిలుస్తున్న దృశ్యాలను కెమెరాలో చూసిన కోహ్లీ వెంటనే వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని, చిన్నారిని కలిశాడు. ఈ సమయంలో  చిన్నారి తను స్వయంగా చేసిన బ్రేస్‌లెట్‌ను కోహ్లీకి అందజేయగా.. తాను ఆ కుటుంబం ముందే దాన్ని తన చేతికి వేసుకున్నాడు. అనంతరం వారితో కలిసి సెల్ఫీ దిగాడు. కాసేపటి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కుటుంబాన్ని కలవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

కాగా, రెండో వన్డేలో ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 181 పరుగులకే కుప్పకూలగా.. విండీస్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం కాగా, కీలకమైన సిరీస్ డిసైడర్ మ్యాచ్ మంగళవారం(ఆగస్ట్ 1) జరగనుంది.