
ముల్లన్పూర్: వరల్డ్ కప్ సన్నాహాల్లో ఉన్న ఇండియా విమెన్స్ జట్టు.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు సిద్ధమైంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1–0 లీడ్లో ఉంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో ఇండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఈ మ్యాచ్కు స్పిన్తో పాటు ఫీల్డింగ్పైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా తొలి మ్యాచ్లో నాలుగు క్యాచ్లు డ్రాప్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు ఛేదించింది. కాబట్టి వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో పాటు ఆసీస్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానున్న నేపథ్యంలో ఫీల్డింగ్ మరింత మెరుగుపర్చుకోవాలని యోచిస్తోంది.
బ్యాటింగ్లో ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ మెరుస్తున్నా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇంకా గాడిలో పడాల్సి ఉంది. మిడిలార్డర్లో జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్లో టీమిండియా చాలా మెరుగుపడాలి. తొలి మ్యాచ్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా.. స్నేహ్ రాణా మాత్రమే వికెట్ సాధించింది. మిగిలిన ముగ్గురు దీప్తి శర్మ, శ్రీచరణి, రాధా యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. క్రాంతి గౌడ్ ఒక్క వికెట్ తీసినా రన్స్ కంట్రోలు చేయలేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో నెగ్గాలంటే టీమిండియా మూడు విభాగాల్లో మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టాలి.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు రికార్డు స్థాయిలో ఎనిమిదో వరల్డ్ కప్ టైటిల్పై గురిపెట్టిన ఆసీస్ అందుకు తగినట్లుగా ప్రిపరేషన్స్ జోరు పెంచింది. తొలి వన్డేలో ఇండియాపై విజయంతో జట్టులో కాన్ఫిడెన్స్ పెరిగింది. దాన్ని ఈ మ్యాచ్లోనూ కంటిన్యూ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా పిచ్లను ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న ఆసీస్ బ్యాటర్లు ఈజీగా రన్స్ రాబడుతున్నారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆడిన ప్లేయర్లు ప్రస్తుత జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం.
కెప్టెన్ అలీసా హీలీ గాడిలో పడితే బ్యాటింగ్లో ఆసీస్కు తిరుగుండదు. లిచ్ఫీల్డ్, బెత్ మూనీ, సదర్లాండ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అయితే గాయంతో తొలి మ్యాచ్లో రిటైర్డ్ హర్ట్ అయిన ఎల్లీస్ పెర్రీ ఇందులో ఆడటం అనుమానంగా ఉంది. బౌలింగ్లో మేఘన్ షుట్, కిమ్ గార్త్, సదర్లాండ్, అలానా కింగ్, తహ్లియా మెక్గ్రాత్ రాణిస్తుండటం సానుకూలాంశం. గాడ్నెర్, పెర్రీ కూడా వికెట్లు తీస్తే ఈ మ్యాచ్లోనూ ఆసీస్ విజయాన్ని అడ్డుకోవడం కష్టమే.