న్యూఢిల్లీ: రూ. లక్షలు, కోట్లు కాదు.. రూ.3,690 లక్షల కోట్లు (45 ట్రిలియన్ డాలర్లు) (ప్రస్తుత డాలర్–రూపాయి వాల్యూ బట్టి) ఇండియా నుంచి బ్రిటిషర్లు దోచుకున్నది. ఇది ప్రస్తుత బ్రిటన్ జీడీపీ కంటే 15 రెట్లు ఎక్కువ. ఇండియా నుంచి దోచుకున్నదంతా తిరిగి ఇద్దామని బ్రిటన్ అనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఇంత సంపదను ఎలా దోచుకున్నారు? దీనికంటూ ఓ థియరీని హిస్టారియన్ ఎకనామిస్ట్ ఉత్సా పట్నాయక్ 2017 లో పబ్లిష్ చేశారు. 1765–1938 మధ్య బ్రిటిషర్లు ఇండియాను ఎల కొల్లగొట్టారో ఈ థియరీలో పేర్కొన్నారు. యూఎస్, యూరప్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎలా వాడుకున్నారో చెప్పారు.
ఇలా దోచుకున్నారు..
దాదాభాయ్ నౌరోజి, ఆర్సీ దత్తా ‘డ్రెయిన్ ఆఫ్ వెల్త్’ థియరీని బయటపెట్టారు. ఈ థియరీని బేస్ చేసుకొని పట్నాయక్ తన రిపోర్ట్ను పబ్లిష్ చేశారు. ఇండియాలో ట్యాక్స్లు వసూలు చేసి ఆ డబ్బులనే ఇండియన్ ఎక్స్పోర్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది. ఇండియన్ ప్రొడ్యూసర్లు అమ్మిన గూడ్స్ను మాత్రం విదేశాల్లో సేల్ చేసి గోల్డ్ లేదా బ్రిటిష్ కరెన్సీలను పొందేది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా నుంచి ఫ్రీగా గూడ్స్ను దక్కించుకుంది. బ్రిటిషర్లు వసూలు చేసిన ట్యాక్స్లో కేవలం మూడో వంతు మాత్రమే ఇండియన్ ప్రొడ్యూసర్లకు ఇవ్వగా, మిగిలిన అమౌంట్ తిరిగి లండన్కు పంపించేసేవారు. ఇలా చేయడం ద్వారా దేశ ఆదాయం బ్రిటన్లో ఉండిపోయింది. ఇండియన్ ప్రొడ్యూసర్లు మాత్రం వారు చెల్లించిన ట్యాక్స్ల నుంచే ఆదాయం పొందారు. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం లండన్లో ఉండడంతో యూఎస్, యూరప్లో మరింతగా విస్తరించడానికి బ్రిటిషర్లు ఈ ఫండ్స్ను వాడుకున్నారు.
19 శతాబ్దంలో ఇండియా నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. రూ.లక్షల కోట్లు తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా, బ్రిటిషర్లు తమ సొంత పనులకు వాడుకున్నారు. ఈ ఫండ్స్ను బ్రిటిషర్లు తిరిగి మన దేశంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే జపాన్ మాదిరి ఇండియాలో కూడా ఇండస్ట్రియలైజేషన్ ఎర్లీ స్టేజ్లో వచ్చేది. అంతేకాకుండా ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న గూడ్స్ను విదేశాలకు చాలా ఎక్కువ ధరకు బ్రిటిషర్లు ఎగుమతి చేసి భారీ లాభాలు గడించారు. 1890 తర్వాత 4 దశాబ్దాల పాటు గూడ్స్ ప్రొడక్షన్లో ఇండియా రెండో ప్లేస్లో కొనసాగిందని పట్నాయక్ పేర్కొన్నారు. ‘ ఇండియాకు మాత్రం కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించలేదు. ఇలా సంపాదించిన భారీ ఫారిన్ కరెన్సీలను, గోల్డ్ను యూరప్ను డెవలప్ చేయడానికి బ్రిటన్ వాడుకుంది. మన లాంటి దేశాల్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతున్నా, ఈ ప్రాంతాల్లో ఫండ్స్ బాగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయంటే పునాది అక్కడే పడింది’ అని ఆమె వివరించారు.
లెక్కలు..
బ్రిటిషర్లు ఇండియా నుంచి ఎంత దోచుకున్నారో పట్నాయక్ లెక్కించారు. 1765–1938 మధ్య గల కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. ఏడాదికి సగటున 5 శాతం వడ్డీని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ లెక్కన మొత్తం 9.2 ట్రిలియన్ పౌండ్లు (ప్రస్తుత లెక్కల ప్రకారం 45 ట్రిలియన్ డాలర్లు ) ఇండియా నుంచి దోచుకున్నారని ఆమె లెక్కించారు. వాస్తవంలో ఈ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుందని, ట్యాక్స్ల ద్వారా దోచుకున్నదాని కంటే ఇండియాలో తిరిగి ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువని పట్నాయక్ అన్నారు. ‘ప్రతీ ఏడాది రూ.100 ట్యాక్స్ వేస్తే రూ.33–36 ఖర్చు చేయలేదు. ప్రతీ రూపాయి పైన ట్యాక్స్ వేశారు కాని ఖర్చు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే భారీగా ఆదాయం జనరేట్ అయ్యేది. ఉద్యోగాలు వచ్చేవి. కానీ, ఈ ప్రభావం ఎకానమీపై చాలా తీవ్రంగా పడింది. ఎంతలా అనేది ఊహించలేము’ అని వివరించారు. బ్రిటన్ కావాలనుకున్నా ఇండియా నుంచి దోచుకున్న అమౌంట్లో పావు వంతు కూడా తిరిగి ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. కాలనీల నుంచి దోచుకొని యూరప్, నార్త్ అమెరికా ప్రాంతాలకు పంపిందని అన్నారు. కానీ, ఇప్పుడున్న అభివృద్ధి చెందిన దేశాలు ఏళ్ల పాటు దోచుకున్న ఫండ్స్ను తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వగలవని ఆమె చెప్పుకొచ్చారు.