
న్యూఢిల్లీ: ఇండో–చైనా బార్డర్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన 59 యాప్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన మరో 47 యాప్లను కూడా సర్కార్ నిషేంధించిందని సమాచారం. ఇప్పటికే బ్యాన్ చేసిన చైనా యాప్స్కు ఈ 47 యాప్స్ క్లోన్స్గా వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఇప్పుడు బ్యాన్ చేసిన యాప్స్ లిస్ట్ను త్వరలోనే కేంద్రం వెల్లడించనుందని తెలుస్తోంది.
చైనాకు చెందిన సుమారు 250 యాప్స్ను నిషేధించే లిస్ట్లో కేంద్రం ఉంచిందని.. ఈ జాబితాలో డ్రాగన్ వ్యాపార దిగ్గజం అలీబాబాతో లింకప్ అయిన యాప్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఈ యాప్స్ యూజర్ల ప్రైవసీ, నేషనల్ సెక్యూరిటీని ఉల్లంఘించాయా అనే దానిపై ఎగ్జామిన్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిషేధిత యాప్స్ లిస్ట్లో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉందని తెలిసింది. చైనాకు చెందిన టాప్ గేమింగ్ యాప్స్ను కూడా ఈ లిస్ట్లో చేర్చారని సమాచారం.