భారతదేశంలో కార్మిక చట్టాలను సులభతరం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అని ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
లేబర్ కోడ్ల వల్ల పరిశ్రమలకు స్పష్టత, సౌలభ్యం లభిస్తుంది. కనీస వేతనం, పని గంటలు, భద్రత వంటి అంశాలు దేశవ్యాప్తంగా ఏకరీతిగా అమలవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అలాగే సంస్థలు సులభంగా వ్యాపారం చేయగలిగితే కొత్త పరిశ్రమలు ఏర్పడి ఉపాధి పెరుగుతుందని వాదిస్తోంది. అయితే చట్టాల వల్ల కార్మికుల హక్కులు బలహీనపడతాయని, యజమానులకు అధిక అధికారాలు లభిస్తాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ముఖ్యంగా పారిశ్రామిక సంబంధాల కోడ్లోని నిబంధనల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, పెద్దసంస్థల్లో కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించే అవకాశం పెరుగుతుంది. పని గంటలను పెంచే అవకాశం ఉండడం వల్ల కార్మికుల ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రాలూ కార్మిక చట్టాల హక్కులు కోల్పోతున్నాయి
4/26 నుంచి దేశవ్యాప్తంగా కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాల ద్వారా పొందుతున్న కనీస హక్కులను రద్దు చేస్తాయి. కనీస వేతనం (స్టేట్) ట్రిబ్యునల్స్, జాతీయ ట్రిబ్యునల్కు మాత్రమే వర్తిస్తాయి. న్యాయస్థానాల ద్వారా పొందే హక్కును లేబర్ కోడ్స్ నిరాకరిస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో పాలనా వ్యవస్థ జోక్యానికి ఇది ఒక నిదర్శనం. ఈ ట్రిబ్యునల్స్ తీర్పుల్లో రాజకీయ జోక్యం పెరుగుతుంది.
పాత కార్మిక చట్టాల్లో కనీస వేతనం నిర్ణయించే అంశం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి అంశంగా ఉంది. కోడ్లలో రాష్ట్రాల హక్కులు తొలగించడమైనది. కేంద్రం కనీస వేతనాలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న వేతనాలు ఇకపై కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటాయి.
కార్మికుని భద్రతా చట్టం నీరుగారింది
లేబర్ కోడ్లో రోజుకు 8 గంటల పని నిబంధన మార్చేశారు. 42 గంటల ప్యాకేజీ పేరిట పిలిచినప్పుడు వచ్చి పనిగంటలతో సంబంధం లేకుండా పని చేయడం వలన ఓటీ వేతనం వచ్చే అవకాశం లేదు. లేబర్ కోడ్లో అప్రెంటీస్ను కార్మికులుగా గుర్తించరు. గడువు ముగిశాక రెగ్యులర్ వర్కర్గా తీసుకోవడం యజమాని దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు.
ఉపాధి హామీ కార్మికులను, పనికి వేతనాలు పొందే వ్యవస్థను లేబర్ కోడ్లో కార్మికులుగా గుర్తింపు లేదు. 10 లక్షల ఆపైన విలువ గల భవన నిర్మాణ సంస్థలు 1% నుంచి 2% వరకు సెస్సు వసూలు చేసి, బిల్డింగ్ బోర్డ్కు జమ చేస్తాయి కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులను వేరే చోట వినియోగిస్తూ చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. లేబర్ కోడ్లో యూనియన్ గుర్తింపు నిబంధనలను కఠినతరం చేసి యూనియన్స్ను బలహీనపరిచే కుట్రపూరిత చర్యలకు కేంద్రం
పాల్పడుతోంది.
కార్మిక సంఘాలు యాజమాన్యాలకు జరిగే సంప్రదింపులను సైతం రద్దు చేసింది. 100 మంది పనిచేసే కంపెనీలు మూసివేయాలన్నా లేక లే ఆఫ్ ప్రకటించాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను తొలగించి.. ఇపుడు300 మంది పనిచేసే సంస్థలకు మాత్రమే అనుమతి అవసరమని మార్చడం కార్మిక హక్కుల చట్టం నీరు కార్చడమే.
4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు పార్లమెంట్ సభ్యులను కలిసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలును ఆలస్యం చేయించడం వంటి చర్యలు చేపట్టాలని కోరాయి.
రాష్ట్రాలు లేబర్కోడ్ల అమలును ఆపేయాలి
మొత్తంగా చూస్తే కొత్త లేబర్ కోడ్లు అభివృద్ధి కోసం తీసుకొచ్చినవని ప్రభుత్వం భావిస్తుండగా, కార్మికుల భద్రతకు ముప్పుగా మారతాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కాబట్టి కార్మికుల హక్కులు, పరిశ్రమల అభివృద్ధి రెండింటికీ సమతుల్యత సాధించే విధంగా చట్టాల్లో మార్పులు చేయడం కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో, ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపి ముందుకుసాగాలి.
రాష్ట్రాల అభిప్రాయాలు తెలపకముందే 4/26 నుంచి అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడం అప్రజాస్వామికం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించి చట్టాలలో మార్పుల కోసం కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధం కావాలి. నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు సుదీర్ఘ కాలం ఉద్యమించి విజయం సాధించిన రైతుల పోరాటం స్ఫూర్తిగా కావాలి.
వీరోచిత పోరాటాల ద్వారా అసమాన ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుకార్చి, ప్రధాని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల కోరిక మేరకు నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ప్రపంచ పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మిక చట్టాల్ని మార్చి వేయడం ద్వారా హైర్ అండ్ ఫైర్ విధానాలకు చట్టబద్ధత కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్న 29 చట్టాల్లో 26 కార్మిక చట్టాలు 1947 తరువాత పార్లమెంట్ ద్వారా ఆమోదించినవే.
వారానికి పనిచేసే గంటలను 90 శాతం పెంచేవిధంగా కార్మికులకు ప్రశ్నించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. 2012 డిసెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు 148 కార్మిక చట్టాలను కోడ్ చేసి పెట్టాలని చెప్పినా, కార్మిక సంరక్షణలను చేర్చకుండా యజమానుల పక్షాన మాత్రమే మార్పులు చేశారు.
పీఎఫ్లో కోత
పాత బోనస్ చట్టం ప్రకారం 8.33 శాతం నుంచి లాభాల మేరకు 20.1 శాతం వరకు పొందే హక్కు ఉంది. కానీ ఎంత లాభాలు ఉన్నా 8.33 బోనస్కు మించి ఇచ్చే అవకాశం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం కార్మికుని వృద్ధాప్య రక్షణ కోసం 12% యజమాని వంతుగా, 12% ఉద్యోగి వంతుగా చెల్లిస్తోంది. ఈ రెండు వంతుల భవిష్య నిధి కార్మికుని సొంతం.
లేబర్ కోడ్లో ఈ కాంట్రిబ్యూషన్ 10 శాతానికి తగ్గించారు. కొన్ని అసమానతల కారణంగా ఈ ఫండ్ 10 శాతం చెల్లించే ఉద్యోగికి 8.5% శాతానికి తగ్గించారు. లేబర్ కోడ్లో గ్రాట్యుటీ రాకుండా వివిధ రకాల మోసం చేస్తున్నారు. పైగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కంటిన్యూయస్ సర్వీస్ లేకుండా ఉద్యోగ భద్రతను హరించేస్తున్నారు.
- దేవీప్రసాద్ రావు, పూర్వ ఉద్యోగ సంఘాల నేత
